అమ్మో! ఈ పిల్లి చిన్నోడు భలే మెక్కేశాడు (పిక్చర్స్)
విశాఖపట్నం: విజయనగరం వాహన తనిఖీ అధికారి (ఇంచార్జీ) పిల్లి చిన్నోడు దిమ్మ తిరిగే ఆస్తులను కూడబెట్టాడు. అవినీతి నిరోధక శాఖ అధికారుల తనిఖీల్లో అతని అక్రమాస్తులు బయటపడ్డాయి. విశాఖపట్నంలో అతనికి మూడు భవనాలు ఉన్నట్లు ఎసిబి అధికారులు గుర్తించారు. నరసహిం నగర్లో మూడు అంతస్థుల భవనం, సీతంపేటలో ఐదంతస్థుల భవనం ఉన్నాయి.
విజయనగరంలో రెండు భవనాలు ఉన్నట్లు ఎసిబి అధికారులు గుర్తించారు. వడ్డాది వద్ద ఓ అతిథి గృహం కూడా ఉంది. వడ్డాది వద్ద కెబి రోడ్డును ఆనుకుని 22 ఎకరాల భూమి ఉంది. దాని విలువ దాదాపు రూ.6.60 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. బుచ్చయ్యపేటలో 60 ఎకరాల పొలం ఉంది. ఎస్బిఐ లాకర్లో 2 కిలోల బంగారం, స్థిర డిపాజిట్లు రూ.7 లక్షలు, ఇంట్లో నగదు రూ.3.14 లక్షలు ఉన్నట్లు ఎసిబి అధికారులు గుర్తించారు. రూ.24 లక్షల జీవిత బీమా ఉంది.
ఇంకా మరికొన్ని లాకర్లు తెరవాల్సే ఉంది. ఆ అధికారి స్వస్థలం నర్సీపట్నం సమీపంలోని రోలుగుంట. ఇంతవరకు ఎసిబి అధికారులు గుర్తించిన ఆస్తుల విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం దాదాపు రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు ఉంటుంది. ఎసిబి అధికారుల అంచనా ప్రకారం రూ.10 కోట్లు ఉంటుంది. బహిరంగ మార్కెట్ ప్రకారం 50 కోట్ల రూపాయలు ఉంటుంది.

పిల్లి చిన్నోడు ఇప్పుడు...
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బుధవారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డ వాహన తనిఖీ అధికారి పిల్లి చిన్నోడు ఇన్ఛార్జి హోదాలో ప్రస్తుతం విజయనగరం రవాణా శాఖ కార్యాలయంలో పని చేస్తున్నారు.

పిల్లి చిన్నోడు గతంలో..
1988లో ఉద్యోగంలో సహాయ మోటారు తనిఖీ అధికారిగా ఉద్యోగంలో చేరిన ఆయన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పని చేశారు.

భారీగా ఆస్తులు...
పిల్లి చిన్నోడు భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రధానంగా విశాఖ నగరం, జిల్లాలో వివిధ రూపాల్లో ఆస్తులను సమకూర్చుకున్నారనే ఆరోపణలు వచ్చాయి.

ఏక కాలంలో దాడులు..
పిల్లి చిన్నోడుపై నిఘా పెట్టిన ఎసిబి బుధవారం ఉదయం నుంచి ఏకకాలంలో 8చోట్ల దాడులు చేశారు. పెద్ద యెత్తున అక్రమాస్తులను గుర్తించారు.

ఇంతింత కాదయా...
ప్లాట్లు, ఫ్లాట్లు, బంగారం, వాణిజ్య సముదాయం, ఫామ్హౌస్, ఎకరాల కొద్దీ భూములు, జీవిత బీమా తదితర రూపాల్లో చిన్నోడు ఆస్తులను సమకూర్చుకున్నట్టు నిగ్గు తేల్చారు. కర్ణాటక బ్యాంకు లాకర్లో ఏకంగా 2 కిలోల బంగారం దొరికింది. ఎస్బిఐలో లాకర్లను తెరవాల్సి ఉంది.

ఇలా సోదాలు..
శ్రీకాకుళం ఎసిబి డీఎస్పీ రంగరాజు ఆధ్వర్యంలో ఈ సోదాలు జరిగాయి. రోలుగుంట పరిసరాల్లో ఏకంగా 60 ఎకరాల భూములు కొనుగోలు తేలింది. ఆయా భూముల్లో మామిడి, జీడితోటలను సాగుచేస్తూ వాటి మధ్యలో ఫాంహౌస్ను కూడా కట్టుకున్నారని ఎసిబి అధికారులు చెబుతున్నారు.

జీవిత బీమా లక్షలే..
చిన్నోడు రూ. 24 లక్షల జీవిత బీమా ప్రీమియం కట్టినట్లు గుర్తించారు. పట్టుబడ్డ ఆస్తుల విలువను రూ. 2 కోట్ల నుంచి రూ. 3 కోట్ల మధ్య ఉండొచ్చని అంచనా వేశారు. వాటి ప్రస్తుత మార్కెట్ విలువ రూ. 50 కోట్లకు పైగా ఉంటుందని ఎసిబి అధికారులు అభిప్రాయపడుతున్నారు.

శ్రీకాకుళం పట్టణానికి తరలింపు
చిన్నోడును తదుపరి విచారణ నిమిత్తం అనిశా అధికారులు శ్రీకాకుళం పట్టణానికి తరలించారు. గురువారం ఎస్బిఐ లాకర్ను తెరిచిన అనంతరం ఆయన్ను కోర్టులో హాజరుపరుస్తారు.

ఉలిక్కిపడ్డ రవాణాశాఖ
వాహన తనిఖీ అధికారి పిల్లి చిన్నోడు అనిశాకు దొరికిపోవటంతో బుధవారం నగరంలోని రవాణాశాఖ అధికారులు ఉలిక్కిపడ్డారు.

అధికారులు ఇలా..
నిరుడు ఆగస్టు నుంచి రవాణాశాఖ కార్యాలయం, అధికారులపై ఎసిబి అధికారులు దృష్టి సారించారు.. ఇప్పటివరకు ముగ్గురు వాహన తనిఖీ అధికారులను ఎసిబి పట్టుకుంది. పది మందికిపైగా రవాణా ఉద్యోగులపై కేసులు నమోదైయ్యాయి.












Click it and Unblock the Notifications