పంచాయతీరాజ్ అధికారి బినామీ ఆస్తులు: తవ్విన కొద్దీ బయటకు...
ఏలూరు: అక్రమాస్తుల కేసులో పట్టుబడిన పశ్చిమ గోదావరి జిల్లా పంచాయతీరాజ్ అధికారి ఎల్ శ్రీధర్ బినామీ అస్తులపై ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఆయన బినామీ పేరు మీద ఉన్న లక్ష్మీ విలాస్ బ్యాంక్ లాకర్పై ఎసిబి అధికారులు దృష్టి సారించారు.
ఏలూరు రామచంద్రరావుపేటలోని లక్ష్మీ విలాస్ బ్యాంక్ లాకర్ను తెరిచిన ఎసిబి అధికారులు దాంట్లోంచి బయటపడుతున్న నగలను చూసి నిశ్చేష్టులయ్యారు. ఇప్పటికే ఈ లాకర్లోంచి అర కిలోకిపైగా బంగారు ఆభరణాలను, 3 కిలోల వెండ ఆభరణాలతో పాటు కొద్దిపాటి నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇంకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఇద్దరు మహిళా దొంగల అరెస్టు
చిత్తూరు జిల్లా మదనపలెల్ పోలీసులు శనివారం ఇద్దరు మహిళా దొంగలను అరెస్టు చేశారు. బస్సుల్లో ప్రయాణిస్తూ తోటి ప్రయాణికులతో పరిచయాలు పెంచుకుని చాకచక్యంగా వారి వద్ద నుంచి బ్యాగులను దొంగిలించడంతో పాటు బంగారు దుకాణాలకు కొనుగోలుదారులుగా వెళ్లి యజమానుల దృష్టి మళ్లించి చోరీలకు పాల్పడుతున్నారు.
వారి నుంచి రూ.2 లక్షల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని కలికిరి గ్రామానికి చెందిన రాణి (30), మంగమ్మ (50) అనే ఇద్దరు మహిళలు జిల్లాలోని పలు పోలీసు స్టేషన్ల పరిధుల్లో చోరీలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది.