'క్యూ' లో ఇంకో 30 మంది : జగన్ వింటున్నారా..! అచ్చెన్న ఏమంటున్నారో
శ్రీకాకుళం : ఫిరాయింపులతో వైసీపీని ఖాళీ చేసే పనిని ముందేసుకున్న ఏపీ అధికార పక్షం.. ఆపరేషన్ ఆకర్ష్ ని విజయవంతంగా కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎంతకాలం ఈ వలసలు కొనసాగుతాయి.. ఇంకెంతమంది సైకిల్ సవారీకి 'సై' అంటున్నారన్న అంశాలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు.
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జరిగిన ఓ సమావేశానికి హాజరైన అచ్చెన్నాయుడు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంకో 30 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్దంగా ఉన్నారంటూ సంచలన కామెంట్స్ చేశారు.
ఇప్పటికే 17 మంది ఎమ్మేల్యేలు సైకిలెక్కేయగా.. అచ్చెన్న చెప్పిన 30 మంది ఎమ్మెల్యేలు కూడా మరో నెల రోజుల్లోనే టీడీపీ కండువాలు కప్పేసుకుంటారట. ఇదీ అచ్చెన్నాయుడే స్వయంగా ప్రకటించారు. కాగా.. అచ్చెన్నాయుడు ఇంత ఖచ్చితంగా ఎమ్మల్యేలను, రోజులను లెక్కగట్టి మరీ చెప్తున్నారంటే, వైసీపీ వెనకాల టీడీపీ పెద్ద గోతులు తవ్వే వ్యవహారమే నడిపిస్తున్నట్టుంది.
అచ్చెన్నాయుడు మాటలపై వైసీపీ ఇంతవరకైతే స్పందించలేదు. మరి అచ్చెన్నాయుడు చెప్పినట్టు నిజంగానే నెల రోజుల్లో మరో 30 మంది ఎమ్మెల్యేలు వైసీపీ గోడ దూకేస్తారా..! లేక ముందే విషయం బయటకు పొక్కొంది కాబట్టి జగన్ నష్ట నివారణ చర్యలు చేపడుతారా..! లేక ఇదంతా టీడీపీ మైండ్ గేమ్ అని సరిపెట్టుకుంటారా..! అనేది తెలియాలంటే ఇంకో నెల రోజులు ఓపిక పట్టాల్సిందే.