రెచ్చగొట్టే దోరణి: కెసిఆర్పై నాయుడు, ఏపిపై లింగారెడ్డి
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కెసిఆర్ రెచ్చగొట్టే దోరణితో వ్యవహరిస్తున్నారని అన్నారు. ఏపి నుంచి వచ్చే వాహనాలపై రవాణా పన్ను విధించాలనుకోవడం దారుణమని ఆయన అన్నారు.
2015 వరకు రవాణా పన్ను విధించకూడదని పునర్విభజన చట్టంలో ఉందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అలాంటప్పుడు ఇప్పుడే రవాణా పన్ను విధించాలనుకోవడం సరికాదని కెసిఆర్కు ఆయన సూచించారు.
కెసిఆర్ ఇప్పుడు బాధ్యత గల ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారని, ఆయన ఈ విధంగా వ్యవహరించడం తగదని అన్నారు. కెసిఆర్ ఏం చేసినా కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆయన ఆరోపించారు.
ఆగడాలు ఆగడం లేదు: రామలింగారెడ్డి
రాష్ట్ర విభజన జరిగిపోయి రెండు రాష్ట్రాలుగా ఏర్పడినప్పటికీ సీమాంధ్రుల ఆగడాలు సాగిస్తూనే ఉన్నారని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే, తెలంగాణ అసెంబ్లీ క్వార్టర్స్ అలాట్మెంట్ ఛైర్మన్ రామలింగారెడ్డి ఆరోపించారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాజధానిని తక్షణమే సీమాంధ్ర ప్రాంతానికి తరలించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వారం రోజుల్లోగా ఆంధ్రా ఎమ్మెల్యేలు క్వార్టర్స్ ఖాళీ చేయాలని ఆదేశించారు.
లేకుంటే కరెంటు, నీటి కనెక్షన్స్ తొలగిస్తామని హెచ్చరించారు. రెండు ప్రాంతాల ఎమ్మెల్యేలకు వేర్వేరు క్వార్టర్స్ కేటాయించినా రెచ్చగొట్టే విధంగా ఆంధ్రా ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేటాయించిన పాత అసెంబ్లీ హాల్ చారిత్రిక భవనమని అన్నారు. ఈ భవనానికి మరమ్మతుల పేరుతో మార్పులు చేయడం సరికాదన్నారు.