ఎంపీకి పెళ్లి సంబంధం చూడమని టీడీపీ నేతలతో మంత్రి
హైదరాబాద్: తమ పార్లమెంటు సభ్యుడికి పెళ్లి చేయాలనుకుంటున్నామని, సంబంధం చూడాలంటూ శ్రీకాకుళం యువ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు చిన్నాన్న, ఆంధ్రప్రదేశ్ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తన సహచర టీడీపీ నాయకులతో సరదాగా వ్యాఖ్యానించారు.
మంగళవారం మధ్యాహ్నం అసెంబ్లీ లాబీల్లో ఆయన పార్టీ సహచరులు పయ్యావుల కేశవ్, దూళిపాళ్ల నరేంద్ర, వల్లభనేని వంశీ, వేం నరేందర్ రెడ్డి తదితరులతో పిచ్చాపాటిగా మాట్లాడుతున్నారు.
సోమవారం రాష్ట్ర మంత్రివర్గంలో రాజధాని అంశంపై జరిగిన చర్చ గురించి మాట్లాడుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోలీసులు కక్ష కట్టి తనను ఇబ్బంది పెట్టిన విషయాన్ని పయ్యావుల కేశవ్ సహచరులకు తెలిపారు. ఇంతలో వేం నరేందర్ రెడ్డి అక్కడకు రావడంతో దూళిపాళ్ల ఆయనకు కుర్చీ వేయించి కూర్చోబెట్టారు. అక్కడే ఉన్న విలేకరులు ఆయనను ఉద్దేశించి మీరు తెలంగాణకు ఎప్పుడు వెళ్తారని ప్రశ్నించారు. ఆయన రిమోట్ ఆంధ్రాలోనే ఉందని నవ్వుతూ చెప్పారు.
అఫ్పుడు విషయం పెళ్లి వైపు మళ్లింది. దీంతో అచ్చెన్నాయుడు జోక్యం చేసుకొని మా ఎంపీకి కూడా పెళ్లి చేయాలనుకుంటున్నామని, పెళ్లి సంబంధం చూడాలని వ్యాఖ్యానించారు.