వైసీపీ ఎమ్మెల్సీ భరత్ మిస్సింగ్, కుప్పంలో పార్టీ ఇన్ చార్జ్
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం గురించి తెలియని వాళ్లు ఉండరు. అలాంటి కుప్పంలో చంద్రబాబుపై పోటీగా చేసి ఓడిపోయిన వైసీపీ ఎమ్మెల్సీ భరత్ కు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైసీపీ ఎమ్మెల్సీ భరత్ బాధిత కార్యకర్తల సంఘం నాయకుడు మురళి మా కార్యకర్తల నాయకుడు భరత్ కనిపించడంలేదని అంటున్నారు.
వైసీపీ ఎమ్మెల్సీ భరత్ కనిపించడం లేదని, ఆయన ఆచూకీ తెలిసిన వాళ్ళు మాకు సమాచారం ఇవ్వాలని పోస్టర్లు ముద్రించి కుప్పం నియోజక వర్గంలో అతికించడం, ఆ పోస్టర్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యాయి. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో భరత్ ను ఆ పార్టీ ఎమ్మెల్సీ చేశారు. ఆ తర్వాత కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ ఇన్ చార్జ్ గా నియమించారు. వైసీపీ అధినేత జగన్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులతో కుప్పం నియోజకవర్గంలో భరత్, అతని అనుచరులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బందులకు గురి చేశారని ఆరోపణలు ఉన్నాయి.

కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడుకు ఎదురు తిరిగిన భరత్ వైసీపీ కోసం అప్పట్లో అనేక కార్యక్రమాలు చేపట్టాడు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ కుప్పంలో పర్యటించిన సమయంలో అనేక ఇబ్బందులకు గురిచేశారని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆరోపించారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో వందలాది మంది టీడీపీ కార్యకర్తల మీద కేసులు నమోదు చేశారు.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి పలమనేరు డీఎస్పీతో పాటు కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం లోని అన్ని పోలీస్ స్టేషన్ల పోలీసు అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలపైన అనేక కేసులు నమోదు చేశారు. అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ ఓడిపోవడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కుప్పం నియోజకవర్గానికి భరత్ దూరం అయ్యాడు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆదేశాల మేరకు ఒక్కసారి మాత్రమే భరత్ కుప్పం నియోజకవర్గంలో పర్యటించి ఆ తర్వాత మళ్లీ మాయం అయ్యాడు.

ఎమ్మెల్సీ భరత్ మమ్మల్ని ఆదుకోవడం లేదని, కుప్పం నియోజక వర్గం ఇన్ చార్జ్ గా మరెవరినైనా నియమించాలని వైసీపీ నాయకులు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి మనవి చేశారు. భరత్ అందుబాటులో లేకపోయినా నేను మీకు అండగా ఉంటానని, మీకు ఏమైనా సమస్యలు ఉంటే తిరుపతి వచ్చి తనకు చెప్పాలని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అనేకసార్లు కుప్పం వైసీపీ కార్యకర్తలకు చెప్పారు.
అయితే వైసీపీ ఎమ్మెల్సీ భరత్ కనిపించడం లేదని, ఆయన ఆచూకి తెలియడం లేదని, ఆయన బాధితులు చాలామంది ఉన్నారంటూ పోస్టర్లను ముద్రించడంతో అవి వైరల్ అయ్యాయి. మొత్తం మీద కుప్పం నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తల పరిస్థితి వర్ణనాతీతంగా ఉందని సమాచారం. వైసీపీ ఎమ్మెల్సీ భరత్ కోసం ఆయన బాదితులు చాలా మంది కుప్పంలో ఎదురు చూస్తున్నారని టీడీపీ కార్యకర్తలు సెటైర్లు వేస్తున్నారు.












Click it and Unblock the Notifications