సినిమా టికెట్ల వివాదంలో జగన్ సర్కార్కు బిగ్ రిలీఫ్: అండగా అక్కినేని నాగార్జున: ఇబ్బందేమీ లేదంటూ
అమరావతి/హైదరాబాద్: రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం- తెలుగు చలన చిత్ర పరిశ్రమ మధ్య నెలకొన్న వివాదం సద్దుమణగట్లేదు. పైగా మరింత రాజుకుంటోంది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ వివాదంలో ఎంట్రీ ఇవ్వడంతో మరింత ముదిరింది. ఏపీలో సినిమా టికెట్ల రేట్లను జగన్ సర్కార్ తన నియంత్రణలోకి తీసుకోవడం వల్ల దాని ప్రభావం కలెక్షన్లపై చూపుతుందనే ఆందోళన తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నెలకొని ఉంది.
ట్రాఫిక్లో కదల్లేని స్థితిలో మోడీ: ప్రాణాలతో తిరిగి వెళ్తున్నా, మీ ముఖ్యమంత్రికి థ్యాంక్స్ చెప్పండి
ట్వీట్ల వార్ను మొదలు పెట్టిన ఆర్జీవీ
ఈ పరిస్థితుల మధ్య దర్శకుడు రామ్గోపాల్ వర్మ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానిని లక్ష్యంగా చేసుకుని వరుస ట్వీట్లను సంధించారు. పేర్ని నానిని ట్యాగ్ చేస్తూ పలు ట్వీట్లు సంధించారాయన. కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. సినిమా టికెట్ల నియంత్రణ విషయంలో ఏపీ ప్రభుత్వం- తెలుగు చలనచిత్ర పరిశ్రమ మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించడానికి రాజీ ఫార్ములాతో ముందుకొచ్చారాయన.
ఈ వివాదాల మధ్యే..
ఈ వివాదాల మధ్య జగన్ సర్కార్కు ఓ బిగ్ రిలీఫ్ లభించింది. జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని అక్కినేని నాగార్జున సమర్థించారు. ఈ విషయంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ హీరో కుటుంబం ఏపీ ప్రభుత్వానికి అండగా నిలవడం ఇదే తొలిసారి. అక్కినేని నాగార్జున స్థాయి నటుడు, నిర్మాత, స్టూడియో అధినేత బాహటంగా మద్దతు పలికడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఓ రకంగా ప్రభుత్వానికి ఊరటనిచ్చినట్టయింది.
ఏ ఇబ్బంది లేదు..
సినిమా టికెట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల తనకు ఎలాంటి ఇబ్బంది లేదని అక్కినేని నాగార్జున తేల్చి చెప్పారు. తనకు గానీ, తన సినిమాకు గానీ ఇబ్బంది వచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. టికెట్ల రేట్లను నియంత్రించడం వల్ల తనకు ఎలాంటి అభ్యంతరం లేదని కుండ బద్దలు కొట్టారు. బాహటంగానే ఈ విషయాన్ని ప్రకటించారాయన. సినిమా టికెట్ల రేట్లు ఎక్కువగా ఉంటే కాస్త ఎక్కువగా డబ్బులు వస్తాయి అంతేనని తన వ్యాఖ్యానించారు.
బంగార్రాజు ప్రోగ్రామ్లో..
అక్కినేని నాగార్జున, ఆయన కుమారుడు నాగ చైతన్య హీరోలుగా నటించిన సినిమా బంగార్రాజు. సోగ్గాడు మళ్లీ పుట్టాడు అనేది ట్యాగ్ లైన్. నాగార్జున సరసన సీనియర్ నటి రమ్యకృష్ణ.. నాగ చైతన్యతో జంటగా కృతి షెట్టి నటించారు. కల్యాణ్ కృష్ణ దర్శకుడు జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. సంక్రాతిని పురస్కరించుకుని ఈ నెల 14వ తేదీన ఈ మూవీ విడుదల కానుంది. 2016లో విడుదలైన సోగ్గాడే చిన్నినాయన సినిమాకు ప్రీక్వెల్గా ఈ మూవీ తెరకెక్కింది. ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్లో విలేకరులు అడిగిన ప్రశ్నలకు నాగార్జున.. తన వైఖరిని తేల్చేశారు.
Recommended Video
కలెక్షన్లపై ప్రభావం..
ఏపీలో ప్రస్తుతం నెలకొన్న టికెట్ల నియంత్రణ, తగ్గింపు విషయంలో సినిమాల కలెక్షన్లు భారీగా తగ్గుతాయనే భయాందోళనలు కొద్దిరోజులుగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వ్యక్తమౌతూ వస్తోంది. భారీ చిత్ర నిర్మాతలు, స్టూడియో అధినేతలు ప్రభుత్వంతో ఓ రకంగా పరోక్ష యుద్ధాన్ని సాగిస్తోన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోన్నారు. కే రాఘవేంద్ర రావు, నేచురల్ స్టార్ నాని సహా పలువురు.. జగన్ సర్కార్ నిర్ణయంతో వ్యతిరేకించారు. ఈ పరిస్థితుల్లో నాగార్జున వంటి స్టార్ హీరో ప్రభుత్వానికి అండగా నిలవడం చర్చనీయాంశమైంది.