సీఎంతో నాగార్జున టీం భేటీ - జగన్ తో "మెగా" గ్యాప్ : చిరంజీవి దూరంగా-పవన్ కోసమేనా..!!
ఏపీ ముఖ్యమంత్రి జగన్...మెగాస్టార్ చిరంజీవి సంబంధాల పైన పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ పడిందా. ముఖ్యమంత్రి గా జగన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత అనూహ్యంగా జగన్ -చిరంజీవి మధ్య సత్సంబంధాలు ఏర్పడ్డాయి. రెండు సార్లు చిరంజీవి ఇప్పటి వరకు ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలంటూ జగన్ ను చిరంజీవి కోరగా.. వారి సమస్యలను వివరించే బాధ్యత చిరంజీవి అప్పగించారు సీఎం జగన్. ఇక, సినీ పెద్దలతో కలిసి చిరంజీవి నేరుగా జగన్ ను కలిసారు.

చిరంజీవి ఎందుకు రాలేదు
అదే విధంగా కొంత కాలంగా చిరంజీవి టీం మరోసారి సీఎంను కలుస్తుందనే ప్రచారం సాగింది. ఏపీ మంత్రి పేర్ని నాని సైతం చిరంజీవికి ఫోన్ చేసి సినిమా సమస్యల పైన చర్చలకు సిద్దంగా ఉండాలని..త్వరలోనే సీఎంతో సమావేశం ఉంటుందని సమాచారం ఇచ్చారు. చిరంజీవి సినీ ఇండస్ట్రీలోని పలు విభాగాలకు చెందిన ముఖ్యులతో సమావేశమయ్యారు. ఇక, ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ వేడుక వేదిగా ఏపీ ప్రభుత్వం పైన తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఆన్ లైన్ టిక్కెట్ విధానం పైన విమర్శలు గుప్పించారు.
పవన్ కళ్యాణ్ వివాదమే కారణమా
ప్రభుత్వం నుంచి అదే స్థాయిలో స్పందన వచ్చింది. ఇక, ఏపీ ఫిలిం ఛాంబర్ తమకు పవన్ వ్యాఖ్యలతో సంబంధం లేదని...రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో సత్సంబంధాలు అవసరమని స్పష్టం చేసారు. ఆ తరువాత దిల్ రాజు తో పాటుగా మరి కొందరు నిర్మాతలు...డిస్ట్రిట్యూర్లతో మంత్రి పేర్ని నాని సమావేశమయ్యారు. ఆ సమయంలో ప్రభుత్వం నిర్ణయించిన ఆన్ లైన్ టిక్కెట్ల విధానానికి వారు మద్దతు ప్రకటించారు. ఇక, పవన్ తో వివాదం సాగుతున్న సమయంలోనే దిల్ రాజుతో పాటుగా మరి కొందరు నిర్మాతలు బందరు వెళ్లి మంత్రి పేర్ని నానితో సమావేశమయ్యారు.

చిరంజీవి - సీఎం మధ్య సత్సంబంధాలు
ఆ సమయంలో చిరంజీవి తనకు ఫోన్ చేసిన విషయాన్ని..కొందరు చేస్తున్న వ్యాఖ్యల పట్ల ఆయన విచారం వ్యక్తం చేసారంటూ పరోక్షంగా పవన్ వ్యాఖ్యల పైన స్పందనగా వెల్లడించారు. ఆ వివాదం కొనసాగుతున్న సమయంలో అల్లు అరవింద్...నాగార్జున సైతం స్పందించారు. ఏపీ ప్రభుత్వం సినీ పరిశ్రమ సమస్యలను పరిష్కారం చూపించాలని కోరారు. ప్రభుత్వం తాజాగా ఏపీలోని సినిమా హాళ్లల్లో వంద శాతం ఆక్యెపెన్సీతో పాటుగా నాలుగు షోల ప్రదర్శనకు అనుమతి ఇచ్చింది. దీని పైన సినీ పెద్దలు సంతోషం వ్యక్తం చేసారు.

చిరు - జగన్ కు సన్నిహితుడైన నాగార్జున ఎంట్రీతో
అదే సమయంలో ఇండస్ట్రీలోని ఇతర సమస్యల పైన చర్చించటానికి హీరో నాగార్జున మరో నలుగురు తో కలిసి గన్నవరం చేరుకున్నారు. అక్కడి నుంచి సీఎం క్మాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి భేటీ అవుతున్నారు. నాగార్జునతో పాటుగా నిర్మాత నిరంజన్ రెడ్డి, డైరెక్టర్ ప్రీతమ్ రెడ్డి ఉన్నారు. అయితే, నాగార్జున సినీ పెద్దలతో కలిసి రావటంతో ఇది ఖచ్చితంగా వ్యక్తిగత సమావేశం కాదని..సినీ ఇండస్ట్రీకి సంబంధించిన అంశాలే భేటీ అజెండాగా తెలుస్తోంది. కానీ, ఇటువంటి ఇండస్ట్రీకి సంబంధించిన సమావేశానికి చిరంజీవి ఎందుకు రాలేదనే చర్చ మొదలైంది.

పొలిటికల్- సినీ ఇండస్ట్రీలో ఆసక్తి కర చర్చ
పవన్ పరిశ్రమ విషయంలో ప్రభుత్వం పైన చేసిన వ్యాఖ్యల పట్ల చిరంజీవి స్వయంగా ఫోన్ చేసి మంత్రి పేర్ని నానితో మాట్లాడారు. మరి..అటువంటి చిరంజీవి ఈ భేటీకి ఎందుకు రాలేదంటూ ప్రభుత్వ వర్గాల్లోనూ చర్చ వినిపిస్తోంది. ప్రభుత్వం పైన విమర్శలు చేసిన తరువాత పవన్ పైన వైసీపీ మద్దతుగా నిలిచిన పోసాని లాంటి వారు చేసిన వ్యాఖ్యలు.. అదే విధంగా "మా" ఎన్నికల సమయంలో మోహన్ బాబుకు మద్దతుగా వైసీపీ ప్రచారం చేసిందనే ప్రచారమే ఇందుకు కారణమా అనే చర్చ సాగుతోంది.

"మా" ఎన్నికల్లో అపోహలు...వివాదాలు
"మా" ఎన్నికలతో తమ ప్రభుత్వానికి..పార్టీకి సంబంధం లేదని మంత్రి పేర్ని నాని స్పష్టం చేసారు. చిరంజీవి తన చేతికి చిన్న సర్జరీ కారణంగా షూటింగ్ లకు సైతం దూరంగానే ఉన్నారు. దీంతో..అటు చిరంజీవి..ఇటు సీఎం జగన్ కు ఇద్దరికీ సన్నిహితుడు అయిన నాగార్జన సినీ ప్రముఖుల తో రావటం..సీఎంతో భేటీ కావటం ఇప్పుడు ప్రాధాన్యత అంశంగా మారింది. ఇక, ఈ భేటీలో ఏం చర్చించబోతున్నారు.. చిరంజీవి ఎందుకు రాలేదు..ఇటువంటి వాటికి నాగార్జున స్పష్టత ఇస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications