నరేష్-పవిత్రా లోకేష్ వ్యవహారంలో కీలక మలుపు!
నటి పవిత్రా లోకేష్ ను తాను వివాహం చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా నటుడు నరేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై నరేష్ భార్య రమ్య రఘుపతి కామెంట్స్ చేశారు. తనకు నరేష్ ఇంకా విడాకులివ్వలేదని తెలిపారు. విడాకుల కేసు కోర్టులో నడుస్తోందని, ఇటీవల వాళ్లిద్దరూ విడుదల చేసిన వీడియో తనను ఎంతో బాధకు గురిచేసిందన్నారు. సినిమా ప్రమోషన్ కోసం ఏమైనా చేశారా? అనే అనుమానం కలిగిందని, నాన్నకు విడాకులు ఇవ్వొద్దంటూ తన కుమారుడు తన నుంచి మాట తీసుకున్నాడని చెప్పారు. నరేష్ తో కలిసే ఉంటానని తన 11 సంవత్సరాల కుమారుడికి మాట ఇచ్చినట్లు వెల్లడించారు.
నరేష్ కు విడాకులివ్వడానికి తాను సిద్ధంగా లేనని, వారి వివాహం జరగనివ్వనని తేల్చిచెప్పారు. ఆయనతో కలిసి ఉండటానికే ప్రయత్నిస్తానన్నారు. తాజాగా రమ్య చేసిన హెచ్చరికలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వివాహ బంధంతో త్వరలోనే ఒకటి కాబోతున్నామని, సమస్యలేవీ ఎదురుకావనుకుంటున్న తరుణంలో రమ్య చేసిన హెచ్చరికలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. వివాహానికి ఎటువంటి ఆటంకాలు ఎదురు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నరేష్ పై ఉండటంతో తాజాగా ఆయన భార్య చేసిన వ్యాఖ్యల వెనక ఏమైనా ప్రత్యేక కారణాలున్నాయా? అనే కోణంలో పలు అంశాలు తెరపైకి వస్తున్నాయి.
కొంతకాలం నుంచి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటుడు నరేష్, నటి పవిత్రా లోకేష్ ప్రేమ వ్యవహారం పలు సంచలన పరిణామాలకు వేదికైంది. ఈ వివాహాన్ని నరేష్ భార్య రమ్య వ్యతిరేకిస్తోంది. బెంగళూరులో ఒక హోటల్ లో ఉన్న వీరిద్దరినీ రమ్య నిలదీసింది. వీరి విడాకుల వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉంది. 2022 సంవత్సరంలో తెలుగు పరిశ్రమలో అన్నిటికంటే ఎక్కువమందిని ఆకర్షించిన అంశంగా నరేష్-పవిత్రాలోకేష్ వ్యవహారం నిలిచింది.