తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు ఆదానీ గ్రూప్ ఆసక్తి
హైదరాబాద్: గుజరాత్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ పారిశ్రామిక సంస్థ ఆదానీ గ్రూప్ తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చింది. విద్యుత్, ఆహారశుద్ధి రంగంలో పెట్టుబడులకు ఆసక్తి చూపినట్లుగా తెలుస్తోంది. వైబ్రాంట్ గుజరాత్ సదస్సుకు తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ జూపల్లి కృష్ణారావు వెళ్లారు.
ఈ సందర్భంగా జూపల్లి, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్రతో ఆదానీ సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు. తెలంగాణలో విద్యుత్ కేంద్రాలు, ఆహారశుద్ధి పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని వారు చెప్పారని తెలుస్తోంది.
తెలంగాణ సర్కారు ఏర్పాటు చేయనున్న భూభాగ ఓడరేవులకు కూడా సహకారం అందించేందుకు ఆదానీ సంస్థ అంగీకరించింది. ఆదానీ సంస్థ గుజరాత్లో ఓడరేవులను నిర్వహిస్తోంది. కాగా, సదరు సంస్థ ప్రతినిధులు త్వరలో హైదరాబాదుకు వచ్చి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రసేఖర రావుతో భేటీ కానున్నారు.

మూడు జిల్లాల్లో వెయ్యికోట్లతో రోడ్ల అభివృద్ధి : మంత్రి తుమ్మల
తెలంగాణ రాష్ట్రంలోని నక్సలైట్ల ప్రాబల్య జిల్లాలైన ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో వెయ్యికోట్ల రూపాయలతో రోడ్లను అభివృద్ధి చేయాలని ప్రతిపాదనలతో నివేదిక రూపొందించినట్లు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వర రావు వెల్లడించారు.
ఈ నివేదికను కేంద్రానికి సమర్పించామని పేర్కొన్నారు. ఈ మూడు జిల్లాలను కేంద్రం కూడా నక్సల్స్ ప్రాబల్య జిల్లాలుగా గుర్తించిందని మంత్రి పేర్కొన్నారు. గోదావరి నదిపై మూడు వంతెనల నిర్మాణాన్ని తర్వలో పూర్తి చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టెండర్స్ కమిషనరేట్ను పునరుద్దరించే అంశంపై సమావేశంలో చర్చిస్తామన్నారు.












Click it and Unblock the Notifications