ఏపీలో త్వరలో 'ఆదరణ 3.0'.. లక్షకు పదివేలు కడితే చాలు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని చెబుతున్న విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన పథకాలను అమలు చేయడానికి ప్రయత్నిస్తున్న కూటమి ప్రభుత్వం త్వరలోనే మరో కొత్త పథకాన్ని ఏపీ ప్రజలకు అందించబడుతుంది. ఈ క్రమంలో ఆదరణ 3.O పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి సవిత తెలిపారు.
కల్లుగీత కార్మికులకు మంత్రి శుభవార్త
విజయవాడలో లచ్చన్న 116 జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో త్వరలో కల్లుగీత కార్మికులకు ద్విచక్ర వాహనాలు ఇస్తామని కల్లుగీత కార్మికుల కోసం అత్యాధునిక పరికరాలను ఇస్తామని, తాటి ఉత్పత్తుల తయారీకి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గీత కార్మికుల కోసం ప్రభుత్వ అనేక చర్యలు తీసుకుంటుందని పేర్కొన్న మంత్రి రంపచోడవరం లో తాటి ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

ఆదరణ 3.0 పథకంలో 90శాతం సబ్సిడీ
కల్లుగీత కార్మికులకు ఆర్థిక భరోసా కల్పిస్తామని తెలిపారు ఈ పథకంలో భాగంగా గీత కార్మికులకు ద్విచక్ర వాహనాలను, పరికరాలను 90 శాతం సబ్సిడీతో అందిస్తామని, కేవలం 10 శాతం మాత్రమే లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. గీత కార్మికులకు బైక్ లు అందిస్తామని పేర్కొన్న మంత్రి, ఉదాహరణకు బైక్ ధర లక్ష రూపాయలు ఉంటే 90 వేల రూపాయలు సబ్సిడీ పోగా లబ్ధిదారుడు కేవలం పదివేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
ఆదరణ 3.0 పథకం వారికి కూడా
అయితే ఈ ఆదరణ పథకాన్ని పొందాలంటే లబ్ధిదారులు ఆంధ్రప్రదేశ్లోనే నివాసం ఉండాలని వయసు 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల లోపు ఉండాలని బీసీకి చెందిన వారై ఉండాలని ఆమె పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో మత్స్యకారులు కూడా మంత్రి సవితను కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. దీంతో వారికి కూడా ఆదరణ 3.0 పథకంలో అవకాశం ఇస్తామని మంత్రి తెలిపారు.
మత్స్యకారులకు మంత్రి హామీ
రాష్ట్రంలో మత్స్యకారులను అన్ని విధాలా అభివృద్ధే చేయడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి ఎస్.సవిత తెలిపారు. మత్స్యకారులకు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని తెలిపారు. ఆదరణ 3.0 పథకం అమలులో కూడా మత్స్యకారులకు ప్రాధాన్యమిస్తామని, ఆధునిక పరికరాలు అందజేస్తామని వెల్లడించారు.












Click it and Unblock the Notifications