సికింద్రాబాద్- విశాఖ వందే భారత్ ఎక్స్ప్రెస్ రూట్లో కొత్తగా..
Vande Bharat Express: దేశంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల జోరు రోజురోజుకూ పెరుగుతోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ సెమీ హైస్పీడ్ రైళ్ల సర్వీసులను కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు మరింత చేరువ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 51 రైళ్లు పట్టాలెక్కాయి. వేర్వేరు రాష్ట్రాలు/నగరాల మధ్య పరుగులు పెడుతున్నాయి.
తగ్గని వేగం..
సాధారణ రైళ్లల్లో ఇప్పటివరకు లేని కొన్ని ప్రత్యేకతలు, వేగం.. వందే భారత్ ఎక్స్ప్రెస్లో ఉండటం వల్ల వాటికి డిమాండ్ పెరుగుతోంది. ఆక్యుపెన్సీ రేషియో భారీగా ఉంటోంది. సాధారణ రైళ్లతో పోల్చుకుంటే టికెట్ ధర అధికమే అయినప్పటికీ- త్వరితగతిన గమ్యస్థానాలకు చేరడానికి వందే భారత్ను ఆశ్రయిస్తోన్నారు ప్రయాణికులు.

అపూర్వ ఆదరణ..
సికింద్రాబాద్- విశాఖపట్నం- సికింద్రాబాద్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్కు ప్రయాణికుల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. అంచనాలకు మించిన స్థాయిలో ఆక్యుపెన్సీ రేషియో నమోదవుతోంది. వీకెండ్ రోజుల్లో ప్రయాణికుల తాకిడి మరింత అధికంగా ఉంటోంది. దీనితో పాటు అదనపు స్టేషన్లల్లో హాల్ట సౌకర్యన్ని కల్పించాలనే విజ్ఞప్తులూ అందుతున్నాయి.
కొత్త స్టేషన్లో హాల్ట్..
వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్- విశాఖపట్నం- సికింద్రాబాద్ రూట్లో మరో స్టేషన్లో హాల్ట్ సౌకర్యాన్ని కల్పించారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీదర్ ఓ ప్రకటన జారీ చేశారు. ప్రస్తుతం ఈ ఎక్స్ప్రెస్కు వరంగల్, ఖమ్మం, విజయవాడ జంక్షన్, రాజమండ్రి, సామర్లకోట జంక్షన్లల్లో మాత్రమే హాల్ట్ సౌకర్యం ఉంది.
నిమిషం పాటు ఏలూరులో..
కొత్తగా ఏలూరు రైల్వే స్టేషన్లో వందే భారత్ ఎక్స్ప్రెస్కు హాల్ట్ కల్పించారు. ఈ నెల 25వ తేదీ నుంచి ఇది అమలులోకి వస్తుంది. ఆ తేదీ నుంచి ఏలూరులో వందే భారత్ ఎక్స్ప్రెస్.. నిమిషం పాటు ఆగుతుంది. ఈ నేపథ్యంలో దానికి అటు ఇటుగా ఉండే విజయవాడ, రాజమండ్రి స్టేషన్లల్లో ఈ రైలు సమయాన్ని స్వల్పంగా సవరించాల్సి వచ్చింది.
విజయవాడలో..
నంబర్ 20707 సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి బయలుదేరే వందే భారత్ ఎక్స్ప్రెస్.. ఉదయం 9:05 నిమిషాలకు విజయవాడకు చేరుకుంటుంది. 9:10 నిమిషాలకు బయలుదేరుతుంది.
ఏలూరు టైమ్..
ఉదయం 9:49 నిమిషాలకు ఏలూరు రైల్వే స్టేషన్కు చేరుకుంటుంది. 9:50 నిమిషాలకు బయలుదేరుతుంది. 11 గంటలకు రాజమండ్రికి చేరుకుంటుంది. 11:02 నిమిషాలకు విశాఖపట్నానికి బయలుదేరి వెళ్తుంది.
విశాఖ నుంచి రిటర్న్..
విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్కు తిరుగుముఖం పట్టే నంబర్ 20708 నంబర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ సాయంత్రం 4:38 నిమిషాలకు రాజమండ్రికి చేరుకుంటుంది. 4:40 నిమిషాలకు బయలుదేరుతుంది.
సాయంత్రం వేళ..
సాయంత్రం 5:54 నిమిషాలకు ఏలూరు రైల్వేస్టేషన్కు చేరుకుంటుందీ వందే భారత్ ఎక్స్ప్రెస్. 5:55 నిమిషాలకు బయలుదేరుతుంది. 6:40 నిమిషాలకు విజయవాడకు చేరుకుని.. అయిదు నిమిషాల తరువాత సికింద్రాబాద్ వైపు పరుగులు పెడుతుంది.












Click it and Unblock the Notifications