రెండో కాశ్మీర్గా ఆదిలాబాద్: మండలి ఛైర్మన్ స్వామిగౌడ్
ఆదిలాబాద్: పర్యాటకులకు భారతదేశంలోని కాశ్మీర్ స్వర్గధామమైతే.. తెలంగాణకు ఆదిలాబాద్ జిల్లా కావాలని శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్ ఆకాంక్షించారు. ఆయన మంగళవారం రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్నతో కలిసి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు.
ఈ సందర్భంగా స్వామిగౌడ్ మాట్లాడుతూ.. జిల్లాలోని కుంటాల జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి, కొమురంభీం పేరిట స్మృతివనం ఏర్పాటు చేయాలన్నారు. అలా చేసినట్లయితే ఆదిలాబాద్ జిల్లా రెండో కాశ్మీర్గా తయారవుతుందని వ్యాఖ్యానించారు.
కాశ్మీర్ తరహా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందాలంటే జిల్లాలోని వనరులను, అటవీ ప్రాంతాన్ని సక్రమంగా వినియోగించుకోవాల్సి ఉంటుందని స్వామిగౌడ్ అన్నారు. జిల్లాలో పర్యటించిన సందర్భంగా స్వామిగౌడ్ను ఉద్యోగ సంఘాలు ఘనంగా సన్మనించాయి.
అనంతరం జడ్పి సమావేశ మందిరంలో జడ్పి అత్యవసర సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ‘మన జిల్లా - మన ప్రణాళిక'కు ఆమోదం తెలిపారు.