మంత్రి సురేశ్ కు మరోసారి అస్వస్థత - మార్నింగ్ వాక్ కోసం వెళ్లి : ఒక్క సారిగా..!!
ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ అస్వస్థతకు గురయ్యారు. ఈ రోజు ఉదయం ఆయన మార్నింగ్ వాక్ కు వెళ్లిన సమయంలో ఒక్క సారిగా అస్వస్థతకు లోనయ్యారు. మార్కాపురంలోని తన కళాశాలలో ఉదయం వాకింగ్ చేస్తున్న మంత్రి సురేష్ ఒక్క సారిగా కిందపడ్డారు. విషయం తెలుసుకున్న వైద్యులు అక్కడకు చేరుకుని ప్రాధమిక చికిత్స అందించారు. బీపీలో చోటు చేసుకున్న హెచ్చుతగ్గుల వలనే ఆయన కింద పడిపోయారని వైద్యులు వెల్లడించారు. కళాశాలలోనే మంత్రి సురేష్ విశ్రాంతిలో ఉన్నారు.
కొద్ది రోజుల క్రితం ఏపీ మంత్రులు నిర్వహించిన సామాజిక న్యాయభేరీ బస్సు యాత్ర సమయంలోనూ మంత్రి సురేష్ అస్వస్థతకు గురయ్యారు. వైద్యులు పరీక్షించి యాంజియోగ్రామ్ నిర్వహించారు. ఆయనకు స్టంట్ వేశారు. ఆ సమయంలో సీఎం సైతం ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలంటూ మంత్రి సురేష్ కు సూచించారు. కాగా, ఇప్పుడు సురేశ్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. రెండు నెలల క్రితం జరిగిన మంత్రివర్గ విస్తరణలో భాగంగా ప్రకాశం జిల్లా నుంచి సురేష్ తిరిగి కొనసాగిస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు.
మరో మంత్రి బాలినేని మాజీ అయ్యారు. ప్రస్తుతం సురేష్ ఒక్కరే ప్రకాశం జిల్లా నుంచి మంత్రిగా ఉన్నారు. మూడేళ్ల పాటు విద్యా శాఖ నిర్వహించిన సురేష్.. ఇప్పుడు మున్సిపల్ శాఖా మంత్రిగా వ్యవహరిస్తున్నారు. అయితే, జిల్లాలో రాజకీయంగా చోటు చేసుకుంటున్న మార్పులు.. సొంత పార్టీ వ్యవహారాలతో మంత్రి పైన ఒత్తిడి పెరుగుతున్నట్లుగా చెబుతున్నారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని.. ఎటువంటి ఇబ్బంది లేదని కుటుంబ సభ్యులు స్పష్టం చేసారు.