ఎప్పుడు చేరాలో టిడిపి చెప్పాలి: జగన్కి ఆదినారాయణ ఝలక్, బాబు డైనమిక్: పనగారియా
కడప: తెలుగుదేశం పార్టీలో చేరే విషయమై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి బుధవారం నాడు స్పష్టత ఇచ్చారు. తాను తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ముహూర్తం ఖరారు చేయాల్సింది పార్టీ అధిష్టానమేనని ఆయన తెలిపారు.
పార్టీ ఎప్పుడు ఆహ్వానిస్తే అప్పుడే సైకిల్ ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. కాగా, ఆదినారాయణ రెడ్డి చేరికను కడప జిల్లా జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ రామసుబ్బా రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఆయనను చేర్చుకోవద్దని సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు కూడా చేశారు. దీంతో కొంతకాలంగా ఆదినారాయణ చేరికపై స్తబ్ధత ఏర్పడింది.
ఈ రోజు చీకటి దినం: సర్వేశ్వర రావు
2015లో విశాఖ జిల్లా చరిత్రలో ఇది చీకటి రోజు అని వైసిపి ఎమ్మెల్యే సర్వేశ్వర రావు వ్యాఖ్యానించారు. జెడ్పీ సమావేశంలో ప్రతిపక్ష నేతల పైన తెలుగుదేశం పార్టీ నేతలు దౌర్జన్యం చేశారని ఆరోపించారు. బాక్సైట్ అంశంపై బుధవారం జరిగిన జెడ్పీ సమావేశం దద్దరిల్లింది.
ఈ సందర్భంగా అరకు ఎమ్మెల్యే సర్వేశ్వర రావు మాట్లాడుతూ... బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలన్నారు. దీనికి టిడిపి ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణ మూర్తి, షీలా గోవింద్తో పాటు ఆ పార్టీకి చెందిన ఇతర సభ్యులు అడ్డు తగిలారు.
ప్రతిపక్ష నేతలకు మైక్ ఇవ్వలేదని సర్వేశ్వర రావు మండిపడ్డారు. తమ చేతిలో ఉన్న మైక్ను కూడా లాక్కున్నారన్నారు. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదంటూ ఆయన వాకౌట్ చేశారు. ఏపీ అసెంబ్లీలో తమ మైకులు కట్ చేశారని, ఇప్పుడు జెడ్పీ సమావేశంలోను అలాగే చేస్తున్నారని ధ్వజమెత్తారు.
గల్ఫ్ ఏజెంట్ల పట్ల జాగ్రత్త: పల్లె
ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తున్న వారు ఏజెంట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు. ఎక్కువ వేతనాల పేరిట మభ్యపెట్టే ఏజెంట్లను నమ్మి వెళ్తే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే అన్నారు. ఎన్నారై శాఖను సంప్రదించి ప్రభుత్వ అనుమతి ఉన్న ఏజెంట్ల ద్వారానే గల్ఫ్ దేశాలకు వెళ్లాలన్నారు.
ఏపీలో సమర్థ నాయకత్వం: పనగారియా
ఏపీలో సమర్థవంతమైన నాయకత్వం ఉందని నీతి అయోగ్ వైస్ చైర్మన్ పనగారియా కొనియాడారు. ద్రవ్య లోటు నుంచి నిధుల కొరత వరకూ ఎన్నో కష్టాలు ఉన్నప్పటికీ, నవ్యాంధ్ర వృద్ధి పథంలో దూసుకెళ్తోందన్నారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ డైనమిక్ లీడర్ అన్నారు. రాష్ట్రాన్ని చంద్రబాబు విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నారన్నారు. కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం ఓ గొప్ప కార్యక్రమమని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం తన వంతు సహకారాన్ని అందిస్తుందన్నారు.