ఇక గంటల్లో వైసిపి క్లోజ్: ఆది హెచ్చరిక, 'రోజా వచ్చిందంటే, జగన్ నోటి దురుసుపై ప్రచారం'
నంద్యాలో ఓటమి భయంతోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దాడులకు పాల్పడుతోందని మంత్రి, టిడిపి నేత ఆదినారాయణ రెడ్డి శనివారం విమర్శించారు. రాష్ట్రంలో మరో 44 గంటల్లో వైసిపి క్లోజ్ కాబోతోందని హెచ్చరించారు.
కడప: నంద్యాలో ఓటమి భయంతోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దాడులకు పాల్పడుతోందని మంత్రి, టిడిపి నేత ఆదినారాయణ రెడ్డి శనివారం విమర్శించారు. రాష్ట్రంలో మరో 44 గంటల్లో వైసిపి క్లోజ్ కాబోతోందని హెచ్చరించారు.
గంటల్లో వైసిపి క్లోజ్
కొద్ది గంటల్లో నంద్యాల ఫలితాలు రానున్నాయని, టిడిపి భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని చెప్పారు. నంద్యాలలో ఓటమితో వైసిపి పని ఖతం అయినట్లేనని, భవిష్యత్తులో ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారు.
రోజా వచ్చిందంటే..
వైసిపి ఎమ్మెల్యే రోజా వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమైనట్లేనని ఆదినారాయణ రెడ్డి అన్నారు. మొన్న నంద్యాల వచ్చిందని, అక్కడ గెలుస్తున్నామని, ఇప్పుడు కాకినాడలో అడుగు పెట్టిందని, ఇక్కడా గెలుస్తున్నామని టిడిపి నేతలు చెప్పారు.
జగన్ రెండు రోజుల కంటే ఎక్కువ ఉండడు కానీ
రాష్ట్రానికి ప్రతిపక్ష నేత అయిన జగన్ కనీసం రెండు రోజుల కంటే ఎక్కువ తన నియోజకవర్గమైన పులివెందులలో ఉండరని, నంద్యాల ఉప ఎన్నికల్లో ఓటమి పాలైతే తన ఉనికి ఉండదనే భయంతో ఎన్నడూ లేనంతగా ఏకంగా 13 రోజుల పాటు ప్రచారం చేశారని టిడిపి కడప జిల్లా అధ్యక్షులు శ్రీనివాసుల రెడ్డి అన్నారు.
ఇక వైసిపి ఉండదు
అది ఎన్నికల ప్రచారం కూడా కాదు కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు, టిడిపిని తిట్టడం కోసమే నంద్యాలలో ఉన్నట్లుగా ఉందని శ్రీనివాసుల రెడ్డి ఎద్దేవా చేశారు. నంద్యాల ఎన్నికల తర్వాత వైసిపి ఉండదని జోస్యం చెప్పారు.
అఖిలప్రియను రోజా అనడమా
కడప ఎన్నికల్లో బాహుబలి 1ని, నంద్యాల ఎన్నికల్లో బాహుబలి 2ని, 2019 ఎన్నికల్లో బాహుబలిని వైసిపికి చూపించి ప్రతిపక్షంలేని రాష్ట్రంగా ఏపీని మార్చనున్నట్లు శ్రీనివాసుల రెడ్డి స్పష్టం చేశారు. తల్లిదండ్రులను పోగొట్టుకుని ప్రజల కోసం అఖిలప్రియ పనిచేస్తుంటే రోజా అనరాని మాటలు అంటోందని గతాన్ని నెమరేసుకుంటే ఏమిటో అందరికీ తెలుసునన్నారు.
ఇంటింటికి వెళ్లి జగన్ నోటి దురుసుతనం చెప్తాం
సెప్టెంబర్ నెలలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమానికి శ్రీకారం చుడతాన్నామని అందులో ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రచారం చేయడంతో పాటు జగన్ గురించి ఆయన నోటి దరుసుతనంపై ప్రచారం చేస్తామని శ్రీనివాసుల రెడ్డి అన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో 20 వేల ఆధిక్యంతో టిడిపి విజయం సాధిస్తుందన్నారు.