ADR Report: వైసీపీకి అందిన విరాళాల వివరాలు వెల్లడి
న్యూఢిల్లీ/అమరావతి: దేశవ్యాప్తంగా వివిధ జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలకు అందిన విరాళాల వివరాలు వెల్లడయ్యాయి. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్ఈడబ్ల్యూ) సంయుక్తంగా దీనికి సంబంధించిన నివేదికను విడుదల చేశాయి. ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఆయా పార్టీలకు విరాళాలు అందాయి.
2016 నుంచి ఆరు సంవత్సరాల వ్యవధిలో ఆయా పార్టీలకు విరాళాల రూపంలో అందిన వివరాలు ఇందులో పొందుపరిచాయి. ఈ ఆరు సంవత్సరాల కాలంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 330. 44 కోట్ల రూపాయల విరాళాలు అందాయి. ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఈ మొత్తాన్ని అందుకున్న వైఎస్ఆర్సీపీ తెలిపింది. గతంతో పోల్చుకుంటే ఈ మొత్తం 72.43 శాతం అధికం.

భారతీ జనతా పార్టీకి వేల కోట్ల రూపాయలు విరాళాల రూపంలో అందాయి. ఇదివరకటి కంటే 52 శాతం ఎక్కువ మొత్తాన్ని బీజేపీ వసూలు చేసింది. మొత్తంగా 5,271.97 కోట్ల రూపాయల విలువైన ఎలక్టోరల్ బాండ్స్ బీజేపీకి అందాయి. మిగిలిన అన్ని జాతీయ పార్టీలకు అందిన ఎలక్టోరల్ బాండ్స్తో పోల్చుకున్నా కూడా ఒక్క బీజేపీకి వచ్చిన విరాళాలే అధికం.
కాంగ్రెస్ సహా ఇతర జాతీయ పార్టీలన్నింటినీ కలిపి 1783.93 కోట్ల రూపాయల విలువ చేసే ఎలక్టోరల్ బాండ్స్ అందాయి. బీజేపీ తరువాత అత్యధిక విరాళాలను అందుకున్న జాతీయ పార్టీల జాబితాలో కాంగ్రెస్ రెండోస్థానంలో నిలిచింది. హస్తం పార్టీకి 952.29 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ అందాయి. ఈ మొత్తం పార్టీకి విరాళాల్లో 61.54 శాతం.

తృణమూల్ కాంగ్రెస్- 767.88 కోట్ల రూపాయలు, బిజూ జనతా దళ్- 622 కోట్ల రూపాయలు, డీఎంకే- 431.50 కోట్ల రూపాయల విరాళాలు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో లభించాయి. బీఆర్ఎస్- 383.65 కోట్ల రూపాయలు, వైఎస్ఆర్సీపీ- 330 కోట్ల రూపాయలు విరాళాల అందినట్లు ఏడీఆర్-ఎన్ఈడబ్ల్యూ నివేదిక తెలిపింది.
బీజేపీ ప్రకటించిన కార్పొరేట్ విరాళాలు ఇతర జాతీయ పార్టీలతో పోల్చుకుంటే మూడు నుంచి నాలుగు రెట్లు అధికం. ఈ ఆరు సంవత్సరాల కాలంలో బీఎస్పీకి ఎలాంటి కార్పొరేట్ విరాళాలు అందలేదు. సీపీఐకీ కార్పొరేట్ విరాళాలేవీ లభించలేదు. తెలుగుదేశం పార్టీ, ఏఐఏడీఎంకే.. ఇతర ప్రాంతీయ పార్టీలకు అందిన వివరాలు 100 కోట్ల రూపాయల్లోపే ఉండొచ్చని అంచనా వేసింది.












Click it and Unblock the Notifications