గోవిందుడు కొందరివాడే..అడ్వాన్స్ దర్శనం బుకింగ్ డబ్బులు వెనక్కి...శ్రీవారిని తాకిన లాక్ డౌన్ ప్రభావం
అమరావతి/హైదరాబాద్ : గోవిందుడు కొందరివాడుగా మారిపోయాడు. కోట్లాది భక్తుల కొంగుబంగారంగా చెప్పుకునే తిరుమలేశుడిపై కరోనా వైరస్ ప్రభావం చూపిస్తోంది. కోరుకున్న కోర్కెలు తీర్చే ఆపద మొక్కుల వాడిగా ప్రసిద్ది గాంచిన తిరుపతి వెంకటేశ్వర స్వామి వారు భక్తుల పట్ల సోషల్ డిస్టెన్స్ కాకుండా పూర్తిగా దూరంగా ఉంటున్నారు. అందులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యం భక్తులను నియంత్రిస్తోంది. ప్రజలు సమూహాలుగా ఏర్పడితే కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో తిరుపతి వేంకటేశ్వర స్వామి ఆలయంలో కఠినమైన ఆంక్షలు అమలు చేస్తూ భక్తుల దర్శన సౌకర్యాలను ప్రభుత్వం రద్దు చేసింది.
శ్రీవారి భక్తులకు ఊరట..
సాధారణంగా వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం కొన్ని నెలల ముందు నుండే భక్తులు దర్శనానికి సంబంధించిన టికెట్లను ఆన్ లైన్ లో బుక్ చేసుకోవడం జరుగుతుంది. శ్రీవారి దర్శనాన్ని బట్టి టికెట్ ధర ఉండడం టీటీడి ఆనవాయితీ. కాగా కరోనా మహమ్మారి వల్ల అన్ని పుణ్యక్షేత్రాలను మూసి వేసిన ఏపి ప్రభుత్వం తిరుమల ఆలయాన్ని కూడా మూసి వేసింది. ఐతే ముందస్తుగా డబ్బులు చెల్లించి దర్శనం టికెట్లు పొందిన వారికి దర్శనాన్ని రద్దు చేసి వారు ఆన్ లైన్ లో చెల్లించిన డబ్బులను తిరిగి వెనక్కి ఇచ్చేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సన్నాహాలు చేస్తోంది.
భక్తులు ఆందోళన పడొద్దు..
మార్చి 13 నుండి మే 31వ తేదీ వరకు, శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకున్న వారికి వారి డబ్బులను వెనక్కి ఇవ్వాలని ప్రయత్నిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న లాక్డౌన్ నిర్ణయం కారణంగా శ్రీవారి ఆలయంలో మే 3వ తేదీ వరకు భక్తులకు దర్శనం నిలుపుదల చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా, ఆలయంలో అన్నిరకాల ఆర్జిత సేవలను టిటిడి రద్దు చేసింది.
వివరాల కోసం టీటీడి హెల్ప్ డెస్క్..
ఈ నేపథ్యంలో మార్చి 13 నుండి మే 31వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారాగానీ, పోస్టాఫీసుల ద్వారా గానీ శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఆ మొత్తాన్ని రీఫండ్ చేసేందుకు టిటిడి చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఆర్జిత సేవలను గానీ, దర్శన టికెట్లను గానీ బుక్ చేసుకున్న భక్తులు సంబంధిత టికెట్ వివరాలతోపాటు, బ్యాంకు ఖాతా నంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ వివరాలను [email protected] మెయిల్ ఐడికి పంపాలని టిటిడి కోరుతోంది.
హర్షం వ్యక్తం చేస్తున్న భక్తులు..
ఐటి విభాగం ఆధ్వర్యంలో ఈ వివరాల ఖచ్చితత్వాన్ని పరిశీలించిన అనంతరం రీఫండ్ మొత్తాన్ని నేరుగా భక్తుల ఖాతాల్లోకి జమ చేస్తారు. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనం కోసం ముందస్తుగా బుక్ చేసుకున్న టికెట్ల డబ్బుల అంశంలో భక్తులు ఆందోలన చెందాల్సిన అవసరం లేదంటోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ముందస్తుగా బుక్ చేసుకున్న వారి ఖాతాలోకి డబ్బులు వచ్చి చేరుతాయని, భక్తులు ఎవ్వరూ కూడా దిగులు పడాల్సిన అవసరం లేదని తిరుమల తిరుపతి దేవస్థానం భరోసా ఇస్తోంది. దీంతో దర్శనం కోసం అడ్వాన్స్ గా డబ్బులు కట్టిన వారిలో హర్షం వ్యక్తం అవుతున్నట్టు తెలుస్తోంది.