జగన్ మెడకు చంద్రబాబు నిర్ణయాలు-ఒక్కొక్కటిగా హైకోర్టులో-ఏమాత్రం తప్పించుకోలేకుండా
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో తీసుకున్న పలు నిర్ణయాలు ఇప్పుడు జగన్ సర్కార్ మెడకు చుట్టుకుంటున్నాయి. ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వంలో అప్పటి విధానాల ఆధారంగా తీసుకున్న నిర్ణయాల్ని ఇప్పుడు జగన్ సర్కార్ సమీక్షించడానికి సైతం వీల్లేకుండా పోతోంది. హైకోర్టు ఇస్తున్న తీర్పులే ఇందుకు కారణం. దీంతో జగన్ సర్కార్ తప్పనిసరిగా వాటిని అమలుచేయాల్సిన పరిస్దితులు నెలకొంటున్నాయి. ఇవన్నీ ఆర్ధిక నిర్ణయాలతో లింక్ అయిన వ్యవహారాలు కావడంతో మరింత సమస్యగా మారబోతోంది.

అమరావతి రాజధాని
టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన అమరావతి రాజధానిని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వివిధ కారణాలతో నిలిపేసింది. అంతే కాదు దాని స్ధానంలో మూడు రాజధానుల్ని తెరపైకి తెచ్చింది. దీనిపై రెండేళ్ల పాటు సుదీర్ఘ విచారణ తర్వాత హైకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. దీని ప్రకారం అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం చేసిన సీఆర్డీయే చట్టాన్ని అమలు చేయక తప్పదు. అలాగే అమరావతి స్దానంలో మూడు రాజధానుల కోసం మరో బిల్లు తెచ్చేందుకు కూడా వీల్లేదు. దీంతో జగన్ సర్కార్ ఇరుకునపడింది. అంతటితో ఆగకుండా అమరావతిలో పనులు తిరిగి ప్రారంభించాలని, నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని కూడా హైకోర్టు డెడ్ లైన్ పెట్టడంతో పరిస్ధితి మరింత దారుణంగా తయారైంది.

తాజాగా పీపీఏలపై షాక్
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అమరావతి తరహాలోనే కుదుర్చుకున్న మరో ఒప్పందం విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వ్యవహారం. వీటిని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమీక్షించాలని నిర్ణయించింది. అయితే ఆరంభంలోనే హైకోర్టు బ్రేకులు వేసింది. అయినా ప్రభుత్వం ముందుకెళ్లింది. దీంతో తాజాగా విద్యుత్ సరఫరా చేస్తున్న సంస్ధలతో కుదుర్చుకున్న ఒప్పందాలు ఉల్లంఘించడానికి వీల్లేదంటూ హైకోర్టు తీర్పు నిచ్చింది. అంతే కాదు ఆయా సంస్ధలతో 25 ఏళ్ల పాటు కుదుర్చుకున్న ఒప్పందాలు యథాతథంగా అమలు చేయాలని జగన్ సర్కార్ కు ఆదేశాలు ఇచ్చింది. దీంతో ప్రభుత్వం ఇప్పుడు వీటిని కచ్చితంగా అమలు చేయాల్సిన పరిస్ధితి నెలకొంది.

ఆర్ధిక కష్టాల వేళ భారీ షాకులు
అసలే రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉంది. సంక్షేమ పథకాల అమలుకే డబ్బుల్లేక అప్పులు చేసి అమలు చేస్తున్న పరిస్దితి. ఇలాంటి పరిస్ధితుల్లో హైకోర్టు అమరావతితో పాటు పీపీఏల అమలు కోసం ఇచ్చిన తీర్పులు కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి భారీ షాక్ ఇచ్చాయి. ఇప్పుడు వీటిని కచ్చితంగా అమలు చేసేందుకు ప్రభుత్వం మరిన్ని అప్పులు తెస్తుందా లేక కొత్త దారులు వెతుకుతుందా అన్నది చూడాల్సి ఉంది. ఎందుకంటే నేరుగా హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం ఉల్లంఘించే వీల్లేదు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలు వెతకడం లేదా తీర్పుల్ని యథాతథంగా అమలు చేయడం మాత్రమే ఇప్పుడు ప్రభుత్వం ముందున్న దారులు. దీంతో సర్కార్ ఇరుకునపడుతోంది.
Recommended Video

ముందునుయ్యి, వెనుక గొయ్యి
చంద్రబాబు గతంలో తీసుకున్న నిర్ణయాల్ని సమీక్షించాలని జగన్ తీసుకున్న నిర్ణయాలే తాజా పరిస్ధితికి కారణం. అయితే రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితుల్ని చక్కదిద్దాలంటే అమరావతి రాజధాని, పీపీఏల రూపంలో రెండు కీలక నిర్ణయాల్ని సమీక్షించాల్సిందేనని జగన్ ఎప్పటినుంచో చెప్తున్నారు అయితే అనూహ్యంగా వాటిని సమీక్షించేందుకు వీల్లేకుండా హైకోర్టు ఇచ్చిన తీర్పులు ప్రభుత్వానికి ఇబ్బందిగా మారాయి. కానీ ఈ రెండు నిర్ణయాలు యథాతథంగా అమలు చేసేందుకు తగిన ఆర్ధిక వనరులు లేవన్న విషయం ప్రభుత్వానికి ఎప్పుడో తెలుసు. కానీ హైకోర్టు తీర్పుతో రాష్ట్రంపైనా పెను భారం పడుతుందన్న వాదన సుప్రీంలో వినిపించడం మినహా జగన్ సర్కార్ కు మరో మార్గం లేకుండా పోయింది.












Click it and Unblock the Notifications