రెంటికీ చెడ్డ రేవడిలా సంచైత- తిరిగి బీజేపీలోకి కష్టమే- జగన్ సై అంటే వైసీపీ ఎంట్రీ
విజయనగరం జిల్లాలోని పూసపాటి రాజవంశీకుల కుటుంబానికి చెందిన వ్యక్తిగా లభించిన అవకాశాన్ని సొమ్ముచేసుకుని వైసీపీ సర్కార్ సాయంతో మాన్సాస్ ట్రస్టు, సింహాచలం ఆలయ బోర్డు ఛైర్పర్సన్ అయిన సంచైత గజపతిరాజుకు హైకోర్టు తీర్పు భారీ షాక్ ఇచ్చింది. ఈ తీర్పుతో ఆమె ఈ రెండు ట్రస్టు బోర్డుల నుంచి తప్పుకోవాల్సిన పరిస్దితి ఏర్పడింది. అదే సమయంలో రాజకీయంగానూ ఆమె అడుగులు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది. గతంలో బీజేపీ నేతలు వ్యతిరేకిస్తున్నా వైసీపీ సాయంతో రాజకీయంగా అడుగులు వేసిన సంచైతను ఇప్పుడు ఆదుకోబోతున్నారన్న దానిపై ఊహాగానాలు సాగుతున్నాయి.
సంచైత రాజకీయానికి హైకోర్టు బ్రేక్
పూసపాటి రాజవంశీకులు వంశపారంపర్యంగా ధర్మకర్తలుగా ఉంటూ వస్తున్న మాన్సాస్ ట్రస్టుతో పాటు సింహాచలం ఆలయాలకు ఛైర్పర్సన్గా అర్ధరాత్రి జీవోలతో నియమితురాలైన సంచైత గజపతిరాజుకు ఆ సంతోషం ఎంతోకాలం దక్కలేదు. 15 నెలల పాటు ఈ రెండు బోర్డుల్లో ఆధిపత్యం సాగించిన సంచైతకు హైకోర్టు భారీ షాకిచ్చింది. రాజవంశంలో సంప్రదాయం ప్రకారం కుటుంబంలో పెద్దలకే ఆ పదవి దక్కుతుందని తేల్చేసింది. దీంతో సంచైత మాజీ కాక తప్పలేదు. ఇదంతా ఓ ఎత్తయితే ఆ పదవుల్లోకి రావడానికి సంచైత చేసిన రాజకీయాలు, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు హైకోర్టు తీర్పుతో ఒక్కసారిగా మళ్లీ తెరపైకి వచ్చాయి.
సంచైత అడుగులు ఎటు ?
హైకోర్టు తీర్పు నేపథ్యంలో మాన్సాస్, సింహాచలం బోర్డు ఛైర్పర్సన్ పదవుల నుంచి తప్పుకోనున్న సంచైత తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయన్న ఆసక్తి నెలకొంది. తిరిగి ఈ పదవులు సాధించుకునేందుకు ఏపీ ప్రభుత్వంతో కలిసి ఆమె న్యాయపోరాటానికి దిగుతారా ? లేక రాజకీయాల్లో తిరిగి యాక్టివ్ అవుతారా ? అన్నది ఇంకా తేలడం లేదు. హైకోర్టు తీర్పు కాపీ చదివిన తర్వాత న్యాయనిపుణులతో సంప్రదించి సంచైత ఓ నిర్ణయం తీసుకుంటారని మాన్సాస్ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఎలాగో ప్రస్తుతానికి ఆ పదవుల నుంచి తప్పుకోవడం ఖాయం కావడంతో ఆమె స్దానంలో అశోక్ వెంటనే పగ్గాలు చేపట్టాల్సి ఉంది.
బీజేపీ తిరిగి రానిస్తుందా ?
మాన్సాస్, సింహాచలం బోర్డు ఛైర్పర్సన్ కాకముందు సంచైత గజపతిరాజు ఏపీ బీజేపీ నేతగా ఉండేవారు. కేంద్రంలోని బీజేపీ పెద్దల్ని అప్పుడప్పుడూ కలిసేవారు. అడపాదడపా పార్టీ సమావేశాలకు హాజరవ్వడం మినహా క్రియాశీలకంగా వ్యవహరించింది లేదు. మాన్సాస్ పగ్గాలు చేపట్టాక బీజేపీకి దాదాపుగా దూరమయ్యారు. దీంతో బీజేపీ పార్టీలో ఉంటూనే ఈ రెండు పదవులు చేపట్టిన సంచైతపై ఇప్పటికీ పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. గతంలో సంచైత తీరుపై కేంద్రంలోని పెద్దలకు సైతం ఏపీ బీజేపీ నేతలు ఫిర్యాదులు కూడా చేశారు. కానీ బీజేపీ పెద్దలు వీటిపై స్పందించలేదు. దీంతో కేంద్రంలోని బీజేపీ పెద్దల సాయంతో తిరిగి పార్టీ రాజకీయాల్లోకి రావాలని ఆమె కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.
Recommended Video
వైసీపీలోకి సంచైత గజపతిరాజు ?
మాన్సాస్, సింహాచలం బోర్డుల ఛైర్పర్సన్గా ఏకకాలంలో నియమితురాలైన సంచైత గజపతిరాజు ఆ తర్వాత సొంత పార్టీ బీజేపీకి దూరంగా ఉంటూ వచ్చారు. మరోలా చెప్పాలంటే బీజేపీ నేతలే ఆమెను అనధికారికంగా బహిష్కరించారు. దీంతో ఆమె పూర్తిగా వైసీపీ నేతలతోనే టచ్లో ఉంటూ వచ్చారు. సీఎం జగన్తో పాటు దేవాదాయశాఖమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి వంటి వారితో నిరంతరం టచ్లో ఉంటూ రాజకీయాలు చేస్తూ వచ్చారు. ఇప్పుడున్న పరిస్ధితుల్లో అదే ఆమెకు కలిసొచ్చేలా ఉంది. ఒకవేళ హైకోర్టు తీర్పును ప్రభుత్వం సవాల్ చేసినా న్యాయస్ధానాలు దీన్నే సమర్ధిస్తే మాత్రం ఆమెకు రాజకీయంగా వైసీపీ ఆశ్రయమిచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి బీజేపీకి రాజీనామా చేసి ఇన్నాళ్లూ ఆదుకున్న వైసీపీ గూటికే సంచైత చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి.