పథకాలపై టీడీపీ నేతలకు చంద్రబాబు క్లారిటీ..! టెలీకాన్ఫరెన్స్ లో కీలక వ్యాఖ్యలు..!
ఏపీలో టీడీపీ మహానాడు విజయం తర్వాత ఉత్సాహంగా ఉన్న పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు ఇవాళ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో వారికి భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేసారు. దీంతో పాటు ప్రభుత్వం తరఫున తాను ఏం చేయబోతున్నానో కూడా వారికి చెప్పేశారు. దీంతో పాటు ప్రజలతో మమేకం కావాల్సిన అవసరాన్ని సైతం వారికి గుర్తుచేశారు.
టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యనేతలు, గ్రామస్థాయి నాయకులతో సీఎం చంద్రబాబు ఇవాళ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో కడప మహానాడు అద్భుతంగా జరిగిందని ఆయన తెలిపారు. జిల్లా నాయకత్వమంతా కలిసి పనిచేసి విజయవంతం చేశారన్నారు. సక్సెస్ చేసిన నేతలకు అభినందనలు తెలిపారు. కార్యకర్తలకు హాట్సాఫ్ అన్నారు.నాయకత్వం సమిష్టిగా పనిచేస్తే ఏ కార్యక్రమమైనా సజావుగా జరుగుతుందని కడప మహానాడుతో నిరూపితమైందన్నారు. మంత్రులంతా కార్యకర్తల్లా పనిచేసి స్ఫూర్తినిచ్చారన్నారు.

మహానాడుకు ప్రజలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా రావడం సంతోషాన్నిచ్చిందని చంద్రబాబు తెలిపారు. మహానాడులో ప్రవేశపెట్టిన 'నా తెలుగు కుంటుంబం'లోని ఆరు శాసనాల కాన్సెప్ట్ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతల్ని ఆయన కోరారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తున్నామని తెలిపారు. ఏడాదిలో మన ప్రభుత్వం చేపట్టిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పాలనా నిర్ణయాలపై ప్రజల్లో సానుకూలత ఉందన్నారు.
ప్రజలకు ఏడాది పాలనలో ఏం చేశామో...రాబోయే రోజుల్లో ఏం చేస్తామో మహానాడు ద్వారా వివరించామన్నారు. ప్రజలతో నాయకులు మరింత మమేకమవ్వడం ద్వారా ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలపై నిరంతరం చర్చించేలా చూడాలని చంద్రబాబు కోరారు. తాను ప్రతి నెలా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడాకి కారణం కూడా అదేనన్నారు. ఎమ్మెల్యేలు కూడా విధిగా పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. జూన్ నెలలోనే తల్లికి వందనం, అన్నదాత పథకాలు ప్రారంభిస్తామని, 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించబోతున్నామని చంద్రబాబు తెలిపారు. ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందేలా సంక్షేమ కేలండర్ను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.












Click it and Unblock the Notifications