నంద్యాల ట్విస్ట్: అఖిల-శిల్పాలకు షాక్.. తెరపైకి మూడో పార్టీ అభ్యర్థి
కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల్లో అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటా పోటీగా ఉన్నాయి.ఇప్పటి వరకు కేవలం రెండు పార్టీల మధ్య పోటీగానే కనిపిస్తోంది.
నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల్లో అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటా పోటీగా ఉన్నాయి. ఇప్పటి వరకు కేవలం రెండు పార్టీల మధ్య పోటీగానే కనిపిస్తోంది. ఇప్పటికే టిడిపి, వైసిపిలు ప్రచారం చేస్తున్నాయి.
తాజాగా, నంద్యాల ఉప ఎన్నికల్లో మూడో అభ్యర్థి తెరపైకి వచ్చారు. టిడిపి నుంచి భూమా బ్రహ్మానంద రెడ్డి, వైసిపి నుంచి శిల్పా మోహన్ రెడ్డి బరిలో నిలుస్తున్నారు. ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
అఖిలప్రియపై బైరెడ్డి వివాదాస్పదం: సన్నపాపకు.. పెద్ద గౌను అంటూ!
ఇప్పుడు రాయలసీమ పరిరక్షణ సమితి చైర్మన్ బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఓ అభ్యర్థిని నిలబెడుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం రాజకీయాలు వ్యాపారంలా మారాయన్నారు.
ప్రజా సేవ గురించి, ప్రాంత సమస్యల గురించి ఆలోచించే నాయకులే రావడం లేదని బైరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బు బలంతో గెలవచ్చనే ధీమాతో నేతలు ఉన్నారన్నారు.
తాము మాత్రం హుండీలను ఏర్పాటు చేసి, ప్రజలు ఇచ్చిన చందాలతో ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి నిర్మాణం కోసం నిధులను దుర్వినియోగం చేస్తున్నారన్నారు. జగనేమో రాయలసీమను అస్సలు పట్టించుకోవడం లేదన్నారు. కాగా, బైరెడ్డి తన పార్టీ తరఫున అభ్యర్థిని నిలబెడతానని ప్రకటించడం టిడిపి, వైసిపిలకు షాకని చెప్పవచ్చు.