అసెంబ్లీ డిజైన్...ఇడ్లీ పాత్రలా ఉందా?...ఆగ్రహంతో ఊగిపోయిన చంద్రబాబు....
అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో శాశ్వత అసెంబ్లీ భవనం డిజన్ పై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ముఖ్యమంత్రి చంద్రబాబుకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది...క్యాబినెట్లో అసెంబ్లీ డిజైన్ పై చర్చ సందర్భంగా అసెంబ్లీ డిజైన్ పై కామెంట్లను ప్రస్తావించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోయారు...
ఎపి న్యూ కాపిటల్ సిటీ అమరావతి లో అసెంబ్లీ శాశ్వత భవనానికి ఎపి ప్రభుత్వం టవర్ డిజైన్ ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ డిజైన్ ను ఓకే చెయ్యడం కూడా జరిగిపోయింది. అయితే కేబినెట్ లో ఈ అంశంపై చర్చ సందర్భంగా అసెంబ్లీ టవర్ డిజైన్ ఇడ్లీ పాత్రలా ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న విషయం మంత్రివర్గం సహచరులు సిఎం చంద్రబాబు దృష్టికి తెచ్చారు...ఈ విషయం విన్న వెంటనే చంద్రబాబు ఆవేశాన్ని ఆపుకోలేకపోయారు...ఆ కామెంట్లపై మండిపడ్డారని తెలిసింది.
అసెంబ్లీ...ఇడ్లీ పాత్ర...
అమరావతి అసెంబ్లీ పర్మినెంట్ బిల్డింగ్ కు టవర్ డిజైన్ ఓకే చేసిన అనంతరం ఈ మోడల్ పై సోషల్ మీడియాలో వివిధ కామెంట్లు వెలువడ్డాయి. వీటిలో అసెంబ్లీ టవర్ డిజైన్ ఇడ్లీ పాత్రలా ఉందన్న కామెంట్లను కొందరు వైరల్ చేశారు. దీంతో ఈ విషయం మంత్రివర్గం సభ్యుల వరకు చేరింది. శనివారం క్యాబినెట్ మీటింగ్ లో పలు కీలక అంశాలపై నిర్ణయంతో పాటు అసెంబ్లీ నూతన భవనానికి డిజైన్ ను ఆమోదించే సందర్భంలో చర్చ జరిగింది. ఈ చర్చ జరుగుతున్నప్పుడు మంత్రివర్గం సోషల్ మీడియాలో జరుగుతున్న అసెంబ్లీ-ఇడ్లీపాత్ర ప్రచారం ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు.
సోషల్ మీడియాలో...ఫోటో...కామెంట్...
సోషల్ మీడియాలో అసెంబ్లీ డిజైన్ పై కామెంట్: టాప్ విదేశీ డిజైన్ ఆర్కిటెక్ట్స్, రాజమౌళీ డైరెక్షన్, చార్టెట్ ఫ్లైట్స్ ల కాంబినేషన్...మనదేశ ఆర్కిటెక్ట్స్ మన సంస్కృతిని ఉట్టిపడేలా చెయ్యగలరు అని నిరూపించారు...ఈ ఇడ్లీ పాత్ర అసెంబ్లీ డిజైన్ ద్వారా...
సిఎం మండిపాటు...
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం గురించి మంత్రులు చెప్పగానే సిఎం చంద్రబాబు ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయారట. ప్రపంచంలోనే అత్యుత్తమ సంస్థలతో 100కు పైగా డిజైన్లు గీయించి, వాటి నుంచి ప్రజామోదం పొందిన డిజైన్ ను ఎంపిక చేస్తే, ఇటువంటి ప్రచారం చేయడం ఎంతవరకూ సమంజసమని మండిపడ్డారట.
ఆ విషయం ముందే చెప్పాలి...
అసెంబ్లీ భవన ఆకృతి ఇడ్లీ పాత్రలా, కుక్కర్ గిన్నెలా ఉందని అనుకుంటే, ఆ విషయాన్ని ముందే చెప్పి ఉండాల్సిందన్నారట. అమరావతి ఆకృతులపై ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడటం సరికాదని మండిపడ్డారట. అమరావతి నిర్మాణాలు ప్రపంచంలోనే అత్యుత్తమమైనవిగా పేరు తెచ్చుకుంటాయని చెప్పడంలో తనకు ఎటువంటి సందేహమూ లేదని ఈ సందర్భంగా సిఎం స్పష్టం చేశారట.
ప్రత్యామ్నాయ మార్గం...
అనంతరం అసెంబ్లీ డిజైన్ పై నెగటివ్ ప్రచారానికి ఏ విధంగా చెక్ పెట్టాలో ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పరిష్కార మార్గం సూచించారట. అసెంబ్లీ టవర్ ఆకృతిని జూమ్ చేసి వేరే కోణంలో రేఖాచిత్రాన్ని రూపొందించాలని సిఎం ఆదేశించారట. ఆ తరువాత వాటిని విస్తృతంగా ప్రచారంలోకి తేవాలని సిఎం సూచించినట్లు తెలిసింది.
పోలవరం గురించి క్యాబినెట్ తో...
పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి గడ్కరీతో జరిగిన సమావేశం వివరాలను సీఎం చంద్రబాబు తన మంత్రి వర్గ సహచరుల వద్ద ప్రస్తావించారు. పెరిగిన పునరావాసం, నిర్మాణ ఖర్చులను కేంద్రం అందిస్తుందన్న నమ్మకం ఉందని తనకు ఉందని అన్నారు. ప్రాజెక్టుపై భాజాపా నేతలు కూడా సానుకూలంగా ఉన్నారని, వారు ఢిల్లీ వెళ్లి ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచుతున్నారని తెలిపారు.