'ఒక్కడు' రేపిన కలకలం.. అతనెవరు, ఎక్కడ, వస్తాడా?: రంగంలోకి జగన్!
తమిళనాడులో జల్లికట్టు తరహా ఉద్యమంలో ఏపీలోను ప్రత్యేక హోదా కోసం పోరాడుదామని సోషల్ మీడియాలో వచ్చిన సందేశం ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది.
విజయవాడ: తమిళనాడులో జల్లికట్టు తరహా ఉద్యమంలో ఏపీలోను ప్రత్యేక హోదా కోసం పోరాడుదామని సోషల్ మీడియాలో వచ్చిన సందేశం ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది.
జల్లికట్టు కోసం తమిళ యువత మెరీనా బీచ్ వేదికగా ఉద్యమించింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వచ్చాయి. అదే తరహా ప్రత్యేక హోదా కోసం ఉద్యమిద్దామని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది ఇంతింతై వటుడింతై అన్నట్లుగా.. చివరకు పవన్ కళ్యాణ్, జగన్లు కూడా మద్దతిస్తున్నారు.
జనవరి 26వ తేదీన ప్రత్యేక హోదా కోసం విశాఖ ఆర్కే బీచ్లో నిరసన చేపడతామని పేర్కొన్నారు. దానికి విపక్షాలు మద్దతు పలికాయి. జల్లికట్టుకు - ప్రత్యేక హోదాకు సంబంధం ఏమిటని బీజేపీ, టిడిపిలు ప్రశ్నిస్తున్నాయి.
ఇక్కడ మరో ప్రశ్న కూడా ఉదయిస్తోంది. అసలు హోదా అంశం తెరపైకి (సోషల్ మీడియా ద్వారా, జల్లికట్టులా) రావడానికి కారణమెవరు? సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారాన్ని మొదలుపెట్టిన మొదటి వ్యక్తి ఎవరు? యువత హోదా అంశంపై ఇంతలా గళమెత్తడానికి కారణమైన వ్యక్తి ఎందుకు బయటకు రావడం లేదు? విశాఖలో 26న జరిగే ఆందోళన సమయంలోనైనా అతను వెలుగులోకి వస్తాడా? నాయకత్వం వహిస్తాడా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ప్రస్తుతానికైతే సమాధానం లేదు.
రాజకీయ పార్టీలతో పని లేకుండా జెండాలను, అజెండాలను పక్కన పెట్టి ఆందోళనలో పాల్గొనాలని పిలుపునిస్తున్న వారు మళ్లీ రాజకీయ నాయకుల చేతిలో ఉద్యమాన్ని పెడితే ఫలితాలు దక్కుతాయా అన్న ప్రశ్న ఉదయిస్తుంది.
ఇప్పటికే ఈ ఆందోళనకు మద్ధతునిచ్చిన ప్రతిపక్షం సోషల్ మీడియా వేదికగా సరికొత్త ప్రచారానికి తెరలేపింది. హోదా కోసం మొదటి నుంచి పోరాడుతున్నది తామేనని చాటి చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది.

ఈ పరిణామాలను చూస్తుంటే యువత తలపెట్టిన ఉద్యమం కాస్తా రాజకీయ రంగు పులుముకుంటోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ పార్టీలు ఈ ఆందోళనకు మద్దతు తెలపాలని, కానీ స్వప్రయోజనాల కోసం తమ ఉద్యమంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తే లబ్ది పొందేది నేతలే తప్ప యువత కాదని నిరసనకారులు కాదంటున్నారు. ఆందోళనకు మద్దతు తెలిపిన వారిలో ఎవరో ఒకరు ముందుండి నడిపించాలంటున్నారు.












Click it and Unblock the Notifications