Kidney Scam:ఫేస్బుక్ ప్రకటన చూసి కిడ్నీ దానం..స్టోరీలో పెద్ద ట్విస్ట్..!!
Kidney Transplant:ఆంధ్రప్రదేశ్లో కిడ్నీ దందా యదేచ్ఛగా సాగుతోంది. కొద్ది రోజుల క్రితం విశాఖ కేంద్రంగా వెలుగు చూసిన కిడ్నీ రాకెట్ ఘటన మరువకముందే గుంటూరులో మరో సంఘటన బయటపడింది. సోమవారం గుంటూరులో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార సమావేశానికి గార్లపాటి మధుబాబు అనే వ్యక్తి సమస్య చెప్పుకునేందుకు వచ్చాడు. కేవీపీ కాలనీకి చెందిన మధుబాబు తన కిడ్నీ తీసుకుని ముందుగా ఇస్తామని చెప్పిన డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారంటూ ఫిర్యాదు చేశాడు.
ఇక అసలు వివరాల్లోకి వెళితే.. కిడ్నీ దానం చేస్తే రూ.30 లక్షలు ఇస్తామని విజయవాడకు చెందిన భాషా అనే వ్యక్తి ఫేస్బుక్లో ప్రకటనలు ఇవ్వడంతో అది చూసి తాను కిడ్నీ దానం చేసినట్లు మధు చెప్పాడు. కిడ్నీ దానం చేసిన తర్వాత కేవలం రూ.1 లక్ష పది వేలు మాత్రమే ఇవ్వడంతో మోసపోయినట్లు గుర్తించి గుంటూరు ఎస్పీ వద్ద ఫిర్యాదు చేశాడు.తాను పలు మొబైల్ యాప్ల నుంచి స్థానిక ఫైనాన్షియర్ల నుంచి భారీగా రుణం తీసుకోవడంతో ఆ అప్పును చెల్లించలేని పరిస్థితిలో కిడ్నీ అమ్ముకున్నట్లు పేర్కొన్నాడు.ఇదే సమయంలో ఫేస్బుక్లో ప్రకటన చూసి డబ్బులొస్తే అప్పు తీర్చొచ్చని భావించినట్లు బాధితుడు తెలిపాడు.

అవయవాలు అమ్మడం చట్టరీత్యా విరుద్ధమని తెలిసినా అప్పులు తీరుతాయన్న ఆశతో తన కిడ్నీని అమ్ముకునేందుకు సిద్ధపడ్డాడు మధు. అయితే మొత్తానికే మోసపోయినట్లు గ్రహించాడు. అయితే ఫేస్బుక్లో పోస్టు పెట్టిన బాషా అనే వ్యక్తి తనకు మాట ప్రకారమే డబ్బులు అందాయని చెప్పడంతో నమ్మి కిడ్ని ఇచ్చినట్లు మధుబాబు తెలిపాడు. అనంతరం కిడ్నీ అవసరమైన వ్యక్తికి సంబంధించిన బావమరిది వెంకటేష్ను మధుకు పరిచయం చేశాడు భాషా.
విజయవాడలోని విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్ శరత్ బాబును కూడా మధుకు పరిచయం చేశాడు. ఇక గతేడాది నవంబర్ నెల నుంచి రెగ్యులర్గా హాస్పిటల్కు వెళ్లి హెల్త్ చెకప్ చేసుకోవడంతో పాటు అక్కడే ఉన్న పేషెంట్ కుటుంబాన్ని కూడా మధు కలిసేవాడు. ఆ సమయంలో మెడికల్ టెస్టుల కోసం ఇతరత్రా ఖర్చుల కోసం డబ్బులు కొంత కొంతగా ఇచ్చేవారు.
సర్జరీకి ముందు రూ.50వేలు క్యాష్ రూపంలో చెల్లించినట్లు వెల్లడించిన మధుబాబు... సర్జరీ పూర్తయ్యాక మిగతా సొమ్మును చెల్లిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపాడు.తన అప్పులు తీరుతాయన్న ఆశతో వారు పెట్టిన ప్రతిపాదనకు అంగీకరించాడు మధుబాబు. దీంతో తన భార్య పిల్లలతో కలిసి సుఖంగా జీవించొచ్చని భావించాడు. ఇక్కడే ట్విస్ట్ చోటు చేసుకుంది. జూన్ 15వ తేదీన మధుబాబు నుంచి కిడ్నీ తీసి పేషెంట్కు అమర్చారు. ఈ లోపే మధుబాబు ఆధార్ కార్డుపై అడ్రస్ మార్చేశారు. తన బంధువుకే కిడ్నీ దానం చేస్తున్నట్లుగా చిత్రీకరించారని మధుబాబు ఆవేదన వ్యక్తం చేశాడు.
సర్జరీ అనంతరం బాషా మిగతా డబ్బును చెల్లించలేదని, తన స్నేహితుడికే కిడ్నీని దానం చేసినందున డబ్బులు ఎలా అడుగుతావంటూ ఎదురు ప్రశ్న వేస్తున్నాడని మధుబాబు ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాదు ముందు జరిగిన ఒప్పందం ప్రకారం ఎడమ వైపు కిడ్నీ తీసుకోవాల్సి ఉండగా డాక్టర్ కుడివైపు కిడ్నీని తీసి పేషెంట్కు అమర్చారని మధుబాబు మండిపడ్డాడు. ఇక ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో వెంటనే కేసు నమోదు చేసి విచారణ చేయాల్సిందిగా నాగారంపాలెం పోలీసులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications