తల్లికి వందనం, విద్యార్ధి మిత్ర కిట్లపై లోకేష్ కీలక ఆదేశాలు..! ఇకపై ఇలా..!
ఏపీలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైంది. విద్యార్ధులు స్కూల్స్ కు వెళ్తున్నారు. అయితే ఎప్పటిలా వారికి అందాల్సిన తల్లికి వందనం (talliki vandanam) మొత్తం కానీ, విద్యార్ధి కిట్లు (vidyardhi mitra kits) కానీ అందకపోవడంతో వారిలో ఆందోళన కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఇవాళ ఆ కీలక అప్డేట్ ఇచ్చారు. ఇప్పటికే అధికారులతో సమీక్షలో జూలై 3వ వారంలో తల్లికి వందనం పథకం ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే రాష్ట్రంలో విద్యార్ధి మిత్ర కిట్ల పంపిణీ ప్రారంభమైనట్లు లోకేష్ ప్రకటించారు.
ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ కోసం కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎంశ్రీ పథకం నిధుల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెం.1స్థానంలో ఉందని నారా లోకేష్ తెలిపారు.కడప మోడల్ లో ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 844 స్మార్ట్ కిచెన్ల నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీ కార్యక్రమం ఇప్పటికే ప్రారంభించామని, మెగా పీటీఎం నాటికి పూర్తిస్థాయిలో కిట్ల పంపిణీ చేపడతామన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుకునే 2,03,430 మంది విద్యార్థులకు కూడా కిట్ల పంపిణీ చేపట్టినట్లు చెప్పారు.

మరోవైపు రాష్ట్రంలోని అనాథ పిల్లలకు కూడా 'తల్లికి వందనం' పథకం డబ్బులు అందేలా పక్కా చర్యలు తీసుకోవాలని అధికారులను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఈ పథకం అమలు కోసం పిల్లల గార్డియన్ల వివరాలను కచ్చితంగా సేకరించాలని, ఒకవేళ ఎవరూ లేని పక్షంలో ఆ నిధులను నేరుగా జిల్లా కలెక్టర్కు పంపి, అక్కడ నుండి పిల్లలకు అందేలా చూడాలని ఆదేశించారు. అనాథ పిల్లల బ్యాంక్ ఖాతాలకు నేరుగా డబ్బులు జమ చేసి, వారి చదువు పూర్తయిన తర్వాత ఆ సొమ్మును స్వతంత్రంగా వినియోగించుకునేలా ఒక శాశ్వత విధానం ఉండాలన్నారు. తెలుగు అకాడమీ ముద్రించే టెక్స్ట్బుక్స్ ప్రజలందరికీ సులభంగా అందుబాటులోకి వచ్చేలా అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ప్రముఖ ఈ-కామర్స్ ఆన్లైన్ ప్లాట్ఫార్మ్స్ ద్వారా విక్రయించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రజలు నేరుగా ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసే సదుపాయాన్ని వీలైనంత త్వరగా కల్పించాలని లోకేష్ సూచించారు.














Click it and Unblock the Notifications