వైసీపీ జోరుతో వ్యూహం మార్చిన చంద్రబాబు... టీడీపీ ప్రకటనల వెనుక ఉద్దేశం అదేనా.. !
ఏపీలో స్ధానిక పోరును ఎదుర్కోలేమనే నిర్ణయానికి విపక్ష టీడీపీ వచ్చేసినట్లుగా కనిపిస్తోంది. ఓవైపు అధికార వైసీపీ దాడులను ఎదుర్కొంటూ అతికష్టం మీద అభ్యర్దులను నిలబెడుతున్నా ఫలితం ఉండటం లేదని భావిస్తున్న టీడీపీ తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం చాలా చోట్ల టీడీపీ నేతల నుంచి అధికారిక ప్రకటనలు కూడా వచ్చేస్తున్నాయి. ఇంతకీ టీడీపీ తీసుకున్న నిర్ణయమేంటి, ప్రకటనల నేపథ్యమేంటో ఇప్పుడు చూద్దాం...

వైసీపీ దాడులతో బెంబేలు..
ఏపీలో స్ధానిక ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతోంది. పలుచోట్ల జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. మిగతా ఎన్నికలకు కూడా నామినేషన్ల దాఖలు ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. అయితే కొన్నిచోట్ల మాత్రం విపక్ష టీడీపీ నేతలు అనుకున్న స్ధాయిలో నామినేషన్లు దాఖలు చేయలేకపోతున్నారు. దీనికి అధికార వైసీపీ నేతల నుంచి ఎదురవుతున్న ప్రతిఘటనే కారణం. టీడీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని వైసీపీ సాగిస్తున్న ఈ దాడులతో సాధారణ ప్రజలు సైతం భయభ్రాంతులకు గురవుతున్నారు.

దాడుల నేపథ్యంలో టీడీపీ కీలక నిర్ణయం
రాష్ట్రంలో తమకు అత్యంత కీలకమైన కొన్ని ప్రాంతాల్లో అభ్యర్ధులు నామినేషన్లు వేయకుండా వైసీపీ అడ్డుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్న టీడీపీ తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అధినేత చంద్రబాబు బహిరంగంగా దీన్ని ప్రకటించకపోయినా చాలా చోట్ల నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ లుగా ఉన్న వారు ఈ మేరకు ప్రకటనలు చేస్తున్నారు. వీటి సారాంశం ఏమిటంటే తమకు బలమున్న చోట పోటీ చేయడం లేదా ఎన్నికలకు పూర్తిగా బహిష్కరించడం. తాజాగా చిత్తూరు జిల్లా పుంగనూరు, పల్నాడులోని గురజాల నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ లు అనీషా రెడ్డి, యరపతినేని శ్రీనివాసరావు ఈ మేరకు ప్రకటనలు కూడా చేశారు. మరికొందరు అదే బాటలో ప్రకటనలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

ఎన్నికల బహిష్కరణ మంత్రం..
సాధారణంగా ఏజెన్సీ ప్రాంతాల్లో తాము పోటీ చేసే అవకాశం లేనప్పుడు మావోయిస్టులు కానీ సంఘ విద్రోహ శక్తులు కానీ ఎన్నికల బహిష్కరణ ప్రకటనలు చేస్తుంటారు. కానీ విచిత్రంగా ఓ రాజకీయ పార్టీ, అందులోనూ రాష్ట్రాన్ని 15 ఏళ్లపాటు పాలించిన ముఖ్యమంత్రి, పదేళ్ల పాటు విపక్ష నేతగా ఉన్న వ్యక్తి ఓ యువనేత జోరుకు తట్టుకోలేక ఎన్నికల బహిష్కరణ అస్త్రం ప్రయోగించడమేంటని ఇప్పుడు అంతా చర్చించుకోవాల్సిన పరిస్దితి. అయితే వైసీపీ దాడులను తట్టుకుంటూ గెలుస్తామో లేదో అనే పరిస్ధితుల్లో ఉన్న నాలుగు డబ్బులు తగలేయడం ఎందుకని భావిస్తున్నట్లు టీడీపీ నేతలు కనిపిస్తున్నారు. అందుకే ఈ బహిష్కరణ మంత్రం వాడుతున్నట్లు అర్దమవుతోంది.

టీడీపీ బహిష్కరణతో వైసీపీకే లాభం..
స్ధానిక ఎన్నికల పోరును తమకు బలం లేదన్న కారణంతోనో, వైసీపీ దాడులు చేస్తుందన్న సాకుతోనే బహిష్కరిస్తే రేపు దాని ప్రయోజనం తిరిగి అదే వైసీపీకి చేకూరుతుందన్న చిన్న లాజిక్ ను టీడీపీ ఎందుకు మర్చిపోతుందన్న ప్రశ్న తలెత్తుతోంది. అయితే ప్రస్తుతానికి నెలకొన్న పరిస్ధితులను తమకు అనుకూలంగా మార్చుకోలేక చేతులెత్తేస్తే భవిష్యత్ రాజకీయం ఎలా అనేది ఇప్పుడు టీడీపీ శ్రేణులు కూడా వ్యక్తం చేస్తున్న ప్రశ్న. దీనికి మాత్రం అధిష్టానం వద్ద సరైన సమాధానం లేదు. అయితే ఎలాంటి ప్రయోజనం లేని చోట అనవసరంగా డబ్బు ఖర్చుపెట్టుకుని, దెబ్బలు తిని రాజకీయం చేయడం కంటే మౌనంగా ఎన్నికలు బహిష్కరిస్తేనే మంచిదనేది మరికొందరి వాదన.












Click it and Unblock the Notifications