చంద్రబాబు విదేశీ పర్యటనకు ముందు: జగన్ అలా, పవన్ కళ్యాణ్ ఇలా
విదేశీ పర్యటనకు ముందు ఏపీ సీఎం చంద్రబాబును.. దీక్షతో ప్రతిపక్ష నేత వైయస్ జగన్, లేఖాస్త్రంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేశారు.
హైదరాబాద్: విదేశీ పర్యటనకు ముందు ఏపీ సీఎం చంద్రబాబును.. దీక్షతో ప్రతిపక్ష నేత వైయస్ జగన్, లేఖాస్త్రంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేశారు. విదేశీ కంపెనీలపై చూపే ఆసక్తి రైతుల మీద లేదని ఇరువురు నేతలు విమర్శలు గుప్పించారు.
గుంటూరులో రైతు దీక్ష చేసిన జగన్, వైసిపి నేతలు మొదటి నుంచి రాజధాని అమరావతి భూమి విషయంలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కొని, విదేశీ కంపెనీలకు అప్పగిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా జత కలిశారు. చంద్రబాబు విదేశీ పర్యటనకు ముందు పవన్ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రధాన్యత సంతరించుకుంది. పెట్టుబడుల కోసం విదేశీ కంపెనీలపై చూపించే శ్రద్ధ రైతులపై చూపించరా అని నిలదీశారు.

పెట్టుబడులే లక్ష్యంగా విదేశీ పర్యటన
ఈ నెల 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు చంద్రబాబు, మరో పదిహేను మంది మంత్రులు విదేశాల్లో పర్యటించనున్నారు. పెట్టుబడులే లక్ష్యంగా వీరి పర్యటన సాగనుంది.
ఇలాంటి సమయంలోనే జగన్ రైతు దీక్ష చేపట్టారు. రైతు సమస్యల అంశంపై ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

జగన్ డిమాండ్
ముఖ్యంగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో మిర్చి రైతుల సమస్యలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. మిర్చి రైతు పరిస్థితి దారుణంగా ఉందని, రైతులను ఆదుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జగన్ డిమాండ్ చేశారు.

జగన్ దీక్ష.. పవన్ లేఖ
ఓ వైపు జగన్ దీక్ష కొనసాగుతుండగా.. పవన్ కళ్యాణ్ కూడా లేఖను సంధించారు. పెట్టుబడుల కోసమంటూ విదేశీ కార్పొరేట్ కంపెనీలపై చూపించే శ్రద్ధ దేశానికి అన్నం పెట్టే రైతులపై చూపకపోవడం వల్లే వారంతా రోడ్డెక్కాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. క్వింటాల్ మిర్చికి రూ.11వేల చొప్పున రైతుకు గిట్టుబాటుధర ఇవ్వాలని కోరారు.












Click it and Unblock the Notifications