చంద్రబాబుకు షర్మిల షాక్..! ఆ కీలక ప్రాజెక్టుపై జగన్ వాదనకు మద్దతు..!
ఏపీలో కూటమి సర్కార్ తో అంటకాగుతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఓ కీలక అంశంలో చంద్రబాబుకు షాకిచ్చారు. ఏపీ-తెలంగాణ మధ్య వివాదాస్పదంగా మారిన ఓ రాయలసీమ ప్రాజెక్టుపై ఆమె ఇవాళ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కేవలం కాంట్రాక్టర్ కోసమే, చంద్రబాబు అవినీతి కోసమే ఈ ప్రాజెక్టును తెరపైకి తెస్తున్నారని షర్మిల మండిపడ్డారు. నిన్న జగన్ కూడా ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ తీవ్ర విమర్శలు చేశారు.
అందరూ వద్దంటున్న పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబుకు అంత ప్రేమెందుకో ప్రజలకు అర్థం కావట్లేదని షర్మిల ఆరోపించారు. ఇటు రాష్ట్ర మేధావులు వ్యతిరేకిస్తున్నారని, ఆ ప్రతిపాదన పనికిరాదని సీమ ప్రొఫెసర్లు చెబుతున్నారని,
లక్ష కోట్లకుపైగా ఖర్చు తప్ప ప్రయోజనం లేదని ఇంజినీర్లు మొత్తుకుంటున్నారని షర్మిల గుర్తుచేశారు. ఒక్క కాంట్రాక్టర్ కు తప్ప ఆంధ్రప్రదేశ్ కు ఏ మాత్రం ఉపయోగపడని గుదిబండ ప్రాజెక్టు కోసం రాష్ట్రాన్ని, పాలనను గాలికొదిలేసి ఢిల్లీ చుట్టూ అంత ఆత్రంగా ఎందుకు తిరుగుతున్నారు చంద్రబాబూ అని షర్మిల ప్రశ్నించారు.

బనకచర్ల లింక్ ప్రతిపాదన పోలవరం అసలు ప్రాజెక్టుకే ఎసరుపెడుతుందని పోలవరం ప్రాజెక్టు అథారిటీ చెబుతున్నా చంద్రబాబుకు ఎందుకు అర్ధం కావడం లేదని షర్మిల ప్రశ్నించారు. మీ సొంత ప్రయోజనాల కోసం ఏకంగా పోలవరాన్నే ముంచేద్దామని ప్లాన్ చేస్తున్నారా? అందుకే ఎత్తు తగ్గించారా? అని అడిగారు. ఏ నీళ్ల కోసం బనకచర్ల లింక్ ప్రతిపాదన చేశారని గోదావరి అథారిటీ అడిగిన దానికి మీ సమాధానం ఎక్కడ ? అని నిలదీశారు. రాయలసీమకు హక్కుగా రావాల్సిన కృష్ణా, తుంగభద్ర నీళ్ల గురించి ఆలోచన చేయకుండా..ముక్కు ఎక్కడంటే తలచుట్టూ తిప్పినట్లుగా గోదావరి నుంచి తెస్తామనడం ఎవరిని మోసం చేయడానికి ? అని చంద్రబాబును ప్రశ్నించారు.
2014 నాటికి వైఎస్ ప్రారంభించిన జలయజ్ఞం పెండింగ్ ప్రాజెక్టులు దాదాపు 39కి పైనే ఉన్నాయని, ఈ 10 ఏళ్లలో TDP, YCP ప్రభుత్వాలు తట్టెడు మట్టి కూడా తియ్యలేదనేది కళ్ళకు కట్టిన వాస్తవమని షర్మిల గుర్తుచేశారు. పెండింగ్ ప్రాజెక్టులకు సుమారు రూ.40 వేల కోట్లు వెచ్చిస్తే 50 లక్షల ఎకరాలకు అదనంగా సాగునీరు, కోటి మంది జనాభాకు తాగునీరు అందుతుందని తెలిసినా.. ఇప్పటి కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం బాధాకరమన్నారు. పోలవరంతో సహా జలయజ్ఞం ప్రాజెక్టులు పూర్తి చేస్తే బనకచర్ల అవసరం లేదని తెలిసి ...చంద్రబాబు అనుమతుల కోసం ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారంటే ఇది అవినీతికి వ్యూహం కాకపోతే మరేమిటి ?అన్నారు.
బీజేపీ దత్తపుత్రుడు జగన్ మోహన్ రెడ్డి పోలవరం గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని షర్మిల విమర్శించారు. వైఎస్సార్ కొడుకై ఉండి 5 ఏళ్లలో పోలవరంలో తట్టెడు మట్టి తీశారా అని ప్రశ్నించారు. మహానేత ఆశయ సాధకుడే అయితే పోలవరంపై ఎందుకు నిర్లక్ష్యం చేశారని ప్రశ్నించారు. 2022లో పోలవరం నీటి నిల్వ సామర్ధ్యం 41.15 మీటర్ల కుదించిన పాపం ఆనాటి మీ ప్రభుత్వంది కాదా అని అడిగారు. అంచనా వ్యయం రూ.55 వేల కోట్ల నుంచి రూ.37 వేల కోట్లకు తగ్గిస్తుంటే వేడుక చూసింది మీరు కాదా ? అన్నారు. ప్రాజెక్ట్ ఎత్తు కుదింపు పాపం ముమ్మాటికి జగన్ దేనన్నారు.

చివరి రాష్ట్రంగా మిగులు జలాలను వాడుకోవడం రాష్ట్ర హక్కని, ఈ విషయంలో ఎటువంటి అభ్యంతరాలు లేవని, కానీ పెండింగ్ ప్రాజెక్టులకు పక్కన పెట్టి మీ స్వార్థ ప్రయోజనాలు కోసం అర్థం పర్ధం లేని ప్రాజెక్టులు కడతాం అంటే చూస్తూ ఊరుకొనేది లేదన్నారు. వెంటనే బనకచర్ల ప్రయత్నాలు ఆపాలన్నారు. ముందు పోలవరం సంగతి తేల్చాలన్నారు. పాత డీపీఆర్ ప్రకారమే పోలవరాన్ని 45.7 మీటర్ల ఎత్తులో నిర్మాణం జరిగేలా చూడాలన్నారు. పెండింగ్ లో ఉన్న జలయజ్ఞం ప్రాజెక్టులకు వెంటనే నిధులు కేటాయించి పూర్తి చేయాలని కోరారు.












Click it and Unblock the Notifications