షర్మిలను పెట్టి జగన్ 420 సినిమా: మంత్రి వివాదాస్పద వ్యాఖ్య
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పైన శనివారం తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి జవహర్ ఆదివారం వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.
అమరావతి/గుంటూరు: దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పైన శనివారం తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి జవహర్ ఆదివారం వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.
వైయస్ రాజశేఖర రెడ్డిపై మంత్రి జవహర్ సంచలన వ్యాఖ్యలు
జగన్ పైన ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని తాళ్లపూడి మండలం గజ్జరంలో జరిగిన టిడిపి నియోజకవర్గ సమావేశంలో జవహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
జగన్ యాత్రకు పాపపరిహార యాత్ర పేరు పెట్టాలి
జగన్ త్వరలో ప్రారంభించే యాత్ర పేరు పరిహారయాత్రగా పెట్టుకోవాలని మంత్రి జవహర్ మండిపడ్డారు. అంతకుముందు ఆయన వైయస్ పాలనలో అన్ని విధాలుగా మోసపోయింది దళితులు అని, ఇడుపులపాయలో ఇప్పటికీ దళితుల భూములను వైయస్ కుటుంబ సభ్యులు సాగు చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.
షర్మిలను పెట్టి జగన్ 420 సినిమా
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్మ పైన కూడా ఘాటుగానే స్పందించారు. షర్మిలను పెట్టి జగన్ 420 పేరుతో సినిమా తీయాలని, అలా చేస్తే డబ్బులు కూడా మేమే ఇస్తామని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
కేంద్రానికి వైసిపి నిరాధార ఫిర్యాదు
ఉపాధి హామీ పథకంలో నిధులు తీసుకొచ్చి గ్రామీణులకు ఉపాధి కల్పిస్తుంటే, దీంతో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని రాజకీయ కుట్రతో వైసిపి ఎంపీలు కేంద్రానికి నిరాధారిత ఫిర్యాదు చేశారని రాష్ట్ర భూగర్భ, గనుల శాఖా మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు వేరుగా ఆరోపించారు. వైసిపి నాయకులు అభివృద్ధి నిరోధకులుగా మారరన్నారు.
బొత్సపై సుజనయ కృష్ణ రంగారావు విమర్శలు
రాష్ట్రంలో పట్టణాలతో సమానంగా గ్రామాలలో మౌలికవసతుల కల్పించి అభివృద్ధి బాట పట్టించనున్నామని సుజయ అన్నారు. కూలీలకు వేతనాలు ఇవ్వకపోవడంపై ధర్నాలు చేస్తానని చెప్పిన బొత్స సత్యనారాయణ ఎవరికి వ్యతిరేకంగా చేస్తారో స్పష్టత ఇవ్వాలన్నారు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పథకమని, దానికి రాష్ట్ర ప్రభుత్వంపై నిరసన తెలియజేయడమేంటని, నిరసన తెలిపేవారికి స్పష్టమైన అవగాహన ఉండాలన్నారు. రాష్ట్రానికి వచ్చిన వోక్స్వేగన్ వంటి అతిపెద్ద సంస్థ వెనక్కు వెళ్లిపోవడానికి అప్పటి అసమర్థ కాంగ్రెస్ పాలకులే కారణమని బొత్సను ఉద్దేశించి అన్నారు.