జగన్ దూకుడుతో ప్లాన్ మార్చిన చంద్రబాబు? తాజా వ్యూహమిదే!
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఓవైపు ప్రత్యర్ధులపై మాటల దాడిని తీవ్రతరం చేస్తున్న రాజకీయ పార్టీల అధినేతలు, మరోవైపు వ్యూహాలకు సైతం పదునుపెడుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున ఇన్ ఛార్జ్ లను మార్చడం ప్రారంభించిన వైఎస్ జగన్.. గెలుపు గుర్రాలకే అవకాశం కల్పిస్తున్నారు. దీంతో విపక్ష నేత చంద్రబాబు సైతం ఇప్పుడు తన వ్యూహాల్ని మార్చుకుంటున్నారు.
ఈసారి టీడీపీ అభ్యర్థుల ఎంపికలో సరికొత్త సాంకేతికత ఉపయోగిస్తామని చంద్రబాబు వెల్లడించారు.వైసీపీలో ఎవరైనా మంచివాళ్లు ఉండి టీడీపీలోకి వస్తామంటే ఆలోచిస్తామన్నారు. మునిగే పడవలో ఉండాలని ఎవరైనా ఎందుకు అనుకుంటారు? ఒక చోట దోపిడీ చేసిన వాళ్లను ఇతర నియోజకవర్గాలకు పంపితే గెలుస్తారా? 5 కోట్ల ప్రజలకు, సైకో జగన్కు మధ్య ఈసారి ఎన్నికలు జరగబోతున్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

మరోవైపు గతంలో మాదిరిగా కాకుండా ఈసారి త్వరగానే అభ్యర్థులను ప్రకటిస్తామని చంద్రబాబు వెల్లడించారు. పొత్తులో ఉన్నామని, సీట్ల సర్దుబాటు చేసుకుంటున్నామని స్పష్టత ఇచ్చారు. ఈసారి అభ్యర్థుల ఎంపిక విధానం వినూత్నంగా ఉండబోతోందని హింట్ ఇచ్చేశారు. వైసీపీలోని అసంతృప్తులు తమకెందుకన్నారు. అక్కడ టిక్కెట్ రాలేదని తమ దగ్గరకు వస్తామంటే వారిని ఆదరించాల్సిన అవసరం తమకు లేదన్నారు. వైసీపీలో మంచి వాళ్లు ఉంటే పార్టీలోకి తీసుకునే అంశంపై ఆలోచన చేస్తామన్నారు.
రేపటి నుంచి టీడీపీలో చేరికలకు గేటు తెరుస్తున్న చంద్రబాబు తొలి విడతలో తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి కండువా కప్పబోతున్నారు. అక్కడి నుంచి మొదలుపెట్టి వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, అసంతృప్తులకు టీడీపీలో ద్వారాలు తెరవాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమం పూర్తి చేసి సాధ్యమైనంత త్వరగా అభ్యర్ధుల్ని ప్రకటించేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు.












Click it and Unblock the Notifications