3 దశాబ్దాలు మావే, భయమొద్దు నేను ఉంటా: బాబు, 'స్మార్ట్ విశాఖ'కు అమెరికా హెల్ప్
విశాఖ: రాబోయే రెండు మూడు దశాబ్దాలు భారత దేశానివేనని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం అన్నారు. 'స్మార్ట్ విశాఖ'కు అమెరికా సహకారం అందించనుంది. ఇందుకోసం చంద్రబాబు సమక్షంలో కీలక ఒప్పందాలు జరిగాయి.
ఏపీ ప్రభుత్వంతో అమెరికా ట్రేడ్ ఏజెన్సీ ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. భారత్లో చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పారు. భారత్కు జనాభాయే కీలకమన్నారు. ఇక్కడ మానవ వనరులు అపారమని చెప్పారు.
విశాఖ నుంచి ముంబై ఎక్స్ప్రెస్ వే పైన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో చర్చించానని చెప్పారు. భారత్లో తీర ప్రాంత అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని చెప్పారు. చెన్నై నుంచి బెంగళూరుకు.. కృష్ణపట్నం మీదుగా పారిశ్రామిక కారిడార్పై జైకా పని చేస్తోందన్నారు.
చెన్నై నుంచి విశాఖ పారిశ్రామిక కారిడార్ పైన ఏడీబీ పని చేస్తోందన్నారు. భవిష్యత్తులో గోదావరి నదిని పెన్నాతో అనుసంధానం చేస్తామని చెప్పారు. ఇప్పటికే గోదావరి - కృష్ణా నదులను అనుసంధానం చేశామని చెప్పారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ భారతీయులేనని చెప్పారు.
సిలికాన్ వ్యాలీలో ఎక్కువమంది పారిశ్రామికవేత్తలు భారతీయులే అన్నారు. క్రియేటివిటీలో భారత్కు ఎనలేని మానవ వనరులు ఉన్నాయని చెప్పారు. తన అడ్మినిస్ట్రేషన్ స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పారు. భారత్లో తొలి దశలో 20 నగరాలను స్మార్ట్ సిటీకి ఎంపిక చేశారని, అందులో విశాఖ నగరం కూడా ఉందని చెప్పారు.
విశాఖ చాలా అందమైన నగరమని చెప్పారు. విశాఖ ప్రజలు కూడా చాలా మంచివారని, పాజిటివ్గా ఉంటారని, వినూత్నంగా, సృజనాత్మకంగా ఆలోచిస్తారని చెప్పారు. దావోస్లో నాలుగో పారిశ్రామిక విప్లవంపై చర్చ జరిగిందని సీఎం చంద్రబాబు చెప్పారు. అమెరికా ప్రభుత్వం, సంస్థలతో కలిసి పని చేయడం అద్భుతమైన అవకాశమన్నారు.
హుధుద్ నుంచి కోలుకున్న విశాఖలో రెండు కీలక సదస్సులు జరిగాయని చెప్పారు. భాగస్వామ్య పెట్టుడుల సదస్సులో 40 దేశాలు పాల్గొన్నాయన్నారు. భారత్లో తొలిసారి ఐఎఫ్ఆర్లో 50 దేశాలు పాల్గొన్నాయని చెప్పారు. విశాఖ నగరాన్ని 50 దేశాల ప్రతినిధులు ప్రశంసించారని చెప్పారు.
ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్న పారిశ్రామికవేత్తలకు భవిష్యత్తు గురించిన దిగులు అక్కర్లేదని చంద్రబాబు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు పరిశ్రమలు పెట్టాలని వస్తే, ఉత్పత్తి ప్రారంభమయ్యే వరకు రెండు నుంచి మూడేళ్లు పడుతుందని అభిప్రాయపడ్డారు.
కొందరిలో కొన్ని భయాలు సహజమని, మీకిచ్చిన హామీలు నెరవేరుస్తామని, పాలనాపరమైన వ్యవహారాలు, స్థలాల సమీకరణ, అనుమతులు, చట్టబద్ధత పరంగా మిమ్మల్ని చూసుకోవడానికి చీఫ్ సెక్రటరీ ఉన్నారని, ఆయన సాంకేతికత, అభివృద్ధి వ్యవహారాలు చూస్తారని, రాజకీయంగా చూసుకోవడానికి నేను ఉన్నానని, నిరభ్యంతరంగా రావాలని, భవిష్యత్తు గురించిన దిగులు వద్దని, ఇక్కడ ఉండేది నేనే అని చెప్పారు.
భారత్తో సంబంధాల్లో ఈ ఏడాది కీలకం: అమెరికా రాయబారి
దేశంలోనే ప్రతిష్టాత్మకమైన విశాఖ పోర్టును అమెరికా రాయబారి రిచర్డ్ సన్ అంతకుముందు సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... భారత్ - అమెరికా మధ్య రక్షణ రంగంలో షరతులు లేని సహకారం దిశగా సంబంధాలు కొనసాగుతున్నాయన్నారు. 500 బిలియన్ డాలర్ల వాణిజ్యం లక్ష్యంగా నిర్ణయించామని, భారత్తో సంబంధాల్లో ఈ ఏడాది తమకు ఎంతో కీలకమన్నారు.