ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా శైలజానాధ్: మరోసారి అనంత జిల్లాకే: ఏఐసీసీ నిర్ణయం..!
సుదీర్ఘ కాలంగా ఖాళీగా ఉన్న ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఎట్టకేలకు ఏఐసీసీ భర్తీ చేసింది. అనేక తర్జన భర్జనల తరువాత తిరిగి అనంతపురం జిల్లాకే చెందిన దళిత నేత..మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజా నాధ్ ను నియమిస్తూ ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. గతంలో పీసీసీ చీఫ్ గా పని చేసిన రఘువీరా రెడ్డి సైతం అనంతపురం జిల్లా బీసీ వర్గానికి చెందిన నేత. రాష్ట్ర విభజన తరువాత రఘువీరా ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేప ట్టారు. అయితే, ఆయన కొద్ది కాలం క్రితం తనను ఏపీ పీసీసీ బాధ్యతల నుండి తప్పించాలని కోరుతూ..రాజీనామా చేసారు. ఆ తరువాత అనేక మంది పేర్లు ప్రచారం లోకి వచ్చాయి. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ లో చేరటంతో... ఆయనకు పీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం సాగింది. అదే విధంగా కేంద్ర మాజీ మంత్రి కాకినాడకు చెందిన పల్లంరాజు పేరు సైతం పరిగణలోకి తీసుకున్నారు. కానీ, ఆయన అందుకు సుముఖత వ్యక్తం చేయకపోవటంతో తిరిగి ...ఇప్పుడు అనంతపురం జిల్లాకు చెందిన శైలజానాధ్ కు ఏపీ పీసీసీ బాధ్యతలు అప్పగించారు.
మాజీ మంత్రిగా...పార్టీ విధేయుడిగా..
శైలజానాద్ రెండు సార్లు కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. 2004,2009లో ఆయన అనంతపురం జిల్లా మడకశిర నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రెండు సార్లు టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి శమంతక మణిని ఓడించారు. 2009 లో వైయస్సార్ రెండో సారి సీఎం అయిన వెంటనే ఉమ్మడి రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుండి విప్ లుగా అవకాశం కల్పించారు. తెలంగాణకు చెందిన మల్లు భట్టివిక్రమార్క కు చీఫ్ విప్ గా..అదే విధంగా రాయలసీమ నుండి శైలజానాద్..ఉత్తరాంధ్ర నుండి కోండ్రు మురళీలను విప్ లుగా నియమించారు.

ఇక, వైయస్సార్ మరణం..ఆ తరువాత రోశయ్య సీఎం అయిన సమయంలోనూ ఆయన విప్ గానే కొనసాగారు. అప్పుడు ఏపీలో సమైక్యాంధ్ర జేఏసీ ఛైర్మన్ గా శైలజానాధ్ వ్యవహరించారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత అనంతపురం జిల్లా నుండి రఘువీరాతో పాటుగా శైలజా నాద్ మంత్రిగా ఆయన కేబినెట్ లో ఛాన్స్ దక్కించుకున్నారు. తొలి సారి మంత్రి అయిన శైలజా నాధ్ ప్రాధమిక విద్యా శాఖ మంత్రిగా వ్యవహరించారు. రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చిన సమయంలో విభజనకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తన వాయిస్ వినిపించారు.
ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లు..
ఇక, ఏపీ కి పీసీసీ చీఫ్ గా శైలజానాద్ ను నియమించిన ఏఐసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఇద్దరికి అవకాశం కల్పించింది. రాయలసీమ ప్రాంతానికి చెందిన తులసి రెడ్డి..అదే విధంగా కోస్తా ప్రాంతానికి చెందిన మైనార్టీ నేత..మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వళిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ లో ఏ నేత యాక్టివ్ గా లేరు. ప్రస్తుతం జరుగుతున్న రాజధాని వివాదం పైనా పార్టీ వాయిస్ ప్రస్తుతానికి టీవీ చర్చల్లోనూ.. బయటా రెగ్యులర్ గా తులసి రెడ్డి..అప్పుడప్పుడూ శైలజా నాధ్ వినిపిస్తున్నారు. దీంతో..ఎస్సీ వర్గానికి చెందిన రాయలసీమ నేతకు కాంగ్రెస్ అధినాయకత్వం ఏపీ కాంగ్రెస్ బాధ్యతలను అప్పగించింది. రాష్ట్ర విభజన కారణంగా ఏపీలో అడ్రస్ కోల్పోయిన కాంగ్రెస్ కు ఇప్పుడు శైలజా నాద్ అధ్యక్షుడిగా ఏ మేర చికిత్స చేయగలుగుతారనేది కాలమే సమాధానం చెప్పాలి.












Click it and Unblock the Notifications