గన్నవరం టు ముంబై: ఎయిరిండియా విమాన సర్వీసులు ప్రారంభం
అమరావతి: పౌర విమానయాన శాఖ మంత్రి పి.అశోక్ గజపతిరాజు శుక్రవారం ఉదయం విజయవాడలోని గన్నవరం ఎయిర్పోర్టు నుంచి ముంబైకి విమాన సర్వీసులను ప్రారంభించారు. ఈ మార్గంలో కొత్త ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానాన్ని నడపనున్నట్లు ఆయన ట్వీట్ చేశారు.
'విజయవాడతో ముంబయిని ఈరోజు అనుసంధానించాం. ఎయిరిండియా కొత్త ఎక్స్ప్రెస్ ఫ్లైట్కి అభినందనలు..' అంటూ ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు. అలాగే బోయింగ్ 777 విమానానికి అత్యంత తక్కువ వయసు కలిగిన మహిళా కమాండర్గా వ్యవహరిస్తున్న అన్నె దివ్యతో ప్రారంభోత్సవం చేయించినట్లు వెల్లడించారు.
గన్నవరం నుంచి రెండు గంటల్లో ముంబైకి...
ఇక విజయవాడ నుంచి ముంబైకి రెండు గంటల్లో చేరొచ్చు. ఈ మేరకు విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి ప్రాంతం నుంచి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎయిరిండియా బోయింగ్ 737-800 విమాన సేవలను ప్రారంభించినట్లు మంత్రి అశోక్ గజపతిరాజు తెలిపారు.
ప్రస్తుతం ముంబై వరకే, ఆ తర్వాత...
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసుతో దేశ ఆర్థిక రాజధాని ముంబైతో అమరావతికి అనుసంధానం ఏర్పడింది. విజయవాడ నుంచి నేరుగా ముంబైకి చేరుకుంటే.. అక్కడి నుంచి ప్రపంచంలోని ఏ దేశానికైనా సులభంగా వెళ్లేందుకు అనుసంధానం ఉంటుంది. ప్రస్తుతం ముంబై వరకే ఉన్న ఈ విమాన సర్వీసును భవిష్యత్తులో దుబాయ్కు పొడిగించే యోచనలో ఎయిరిండియా ఉంది.
అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి...
గన్నవరం ఎయిర్పోర్టును అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామని కేంద్ర పౌర విమానయాన మంత్రి అశోక్ గజపతిరాజు తెలిపారు. ప్రస్తుతం గన్నవరం విమానాశ్రయంలో ఉన్న టెర్నినల్ను రికార్డు స్థాయిలో 12 నెలల్లోనే పూర్తిచేశామని ఆయన చెప్పారు. గన్నవరం విమానాశ్రయంలో నెల రోజుల్లో కార్గో సేవలు కూడా ప్రారంభిస్తామన్నారు. సీ ఫ్లైట్స్, డ్రోన్లపై త్వరలో విధివిధానాలు రూపొందిస్తామని మంత్రి పేర్కొన్నారు.
రైతులు భూములివ్వడం వల్లే...
త్యాగమూర్తులైన గన్నవరం రైతులు భూములు ఇవ్వడం వల్లే మూడేళ్లలో గన్నవరం ఎయిర్పోర్టును ఈ స్థాయిలో అభివృద్ధి చేశామని మంత్రి అశోక్ గజపతిరాజు చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి రన్వే పొడిగింపు పనులు పూర్తిచేయాలని కూడా లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అన్నీ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తిచేసి గన్నవరం నుంచి అంతర్జాతీయ సేవలు కూడా ప్రారంభిస్తామని మంత్రి స్పష్టం చేశారు.