ఏపీకి ‘హోదా’ కోసం బాలకృష్ణ వీరాభిమాని విశాఖలో ఆమరణ దీక్ష
అమరావతి: ఏపీకి ప్రత్యేకహోదా కల్పించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లు ఏపీలో రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించింది. రాజ్యసభలో చర్చ సందర్భంగా ఏపీకి హోదా ఇవ్వలేమని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ తేల్చిన నేపథ్యంపో ఏపీలో ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి.
జైట్లీ వ్యాఖ్యలపై ఏపీలోని రాజకీయ పార్టీలు మండిపడ్డాయి. టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సైతం జైట్లీ వ్యాఖ్యలపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆ తర్వాత జరిగిన పరిమాణాలను పరిశీలిస్తే ఏపీకి చెందిన టీడీపీ, వైసీపీ ఎంపీలు పార్లమెంట్ సభా కార్యక్రమాలను కూడా అడ్డుకున్నారు.
అలా చివరకు శుక్రవారం (ఆగస్టు 5)న రాజ్యసభలో కేవీపీ బిల్లుపై ఓటింగ్కు వచ్చింది. అయితే ఆర్ధిక మంత్రి తెలివిగా కేవీపీ ప్రవేశపెట్టిన బిల్లు మనీ బిల్లు అని తెల్చేయడంతో డిప్యూటీ స్పీకర్ కురియన్ ఈ బిల్లు మనీ బిల్లు లేకా ప్రైవేట్ మెంబర్ బిల్లా తేల్చాలంటూ లోక్సభకు నివేదించారు.
దీంతో గత కొన్ని రోజులుగా ఢిల్లీలో ఏపీకి ప్రత్యేకహోదా అంశంపై జరిగిన పరిణామాలు ఒక్కసారిగా చల్లబడ్డాయి. అయితే ఏపీకి ప్రత్యేకహోదా అంశాన్ని అందివచ్చిన అవకాశంగా పార్టీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో ఎవరికి వారు విడివిడిగా ఆందోళనలు చేపడుతున్నాయి.
ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా అంశం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. హోదా కోసం టాలీవుడ్ నటుడు, అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ రెండు రోజుల క్రితం హైదరాబాదులో స్పందించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని, లేదంటే ఫలితం అనుభవిస్తారంటూ ఆయన బీజేపీపై కాస్తంత ఘాటుగానే స్పందించారు.
బాలకృష్ణ ప్రకటన నేపథ్యంలో విశాఖ జిల్లా పాయకరావుపేటకు చెందిన ఆయన వీరాభిమాని చింతకాయల రాంబాబు వినూత్న నిరసనకు దిగారు. పట్టణంలో టెంటు వేసుకున్న ఆయన ఆమరణ దీక్షకు దిగారు. ఏపికి ప్రత్యేక హోదా ప్రకటించేదాకా తాను దీక్ష విరమించేది లేదని ఆయన ప్రకటించారు.