రాజమండ్రి నుండి పోటీ, కాట్రవల్లి పార్టీ: అలీ, జనసేనపై..
రాజమండ్రి: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాజమండ్రి నుంచే పోటీ చేస్తానని ప్రముఖ నటుడు అలీ చెప్పారు. మైత్రీ యువజనోత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా గైట్ ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం రాత్రి విలేకరులతో మాట్లాడారు. గుంటూరు నుంచి పోటీ చేస్తే అక్కడి వాళ్లు తనను నాన్ లోకల్ అంటారన్నారు.
తెలంగాణ నుండి కూడా పోటీ చేయాలని అక్కడి ప్రాంతం వారూ కోరుతున్నారన్నారు. రాజమండ్రి ప్రజలు మీడియా ముందుకొచ్చి కోరితే రాజమండ్రిలోనే పుట్టి పెరిగిన వాడిని కనుక రాజమండ్రి నుంచే పోటీ చేస్తానని చెప్పారు. అయితే ఏపార్టీ తరపున పోటీ చేస్తారని అడిగిన విలేకరులకు కాట్రవల్లీ పార్టీ తరఫున అంటూ నవ్వుతూ సమాధానాన్ని దాటవేశారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గురించి ప్రస్తావించగా నటుడిగా తనకు అందరూ కావాలన్నారు. వ్యక్తిగతంగా పవన్ మంచి మనసున్న వ్యక్తి అని ఎవరినీ ఇబ్బంది పెట్టే వ్యక్తిత్వం కాదన్నారు. అలీ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసే అవకాశాలున్నాయంటున్నారు.
కాగా, అలీ కొద్ది రోజుల క్రితం టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును కలిశారని, గుంటూరు 1 నుండి పోటీ చేస్తానని అడిగినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు అలీ రాజమండ్రి నుండి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.