ఫలితాలే: చేతులెత్తేసిన చిరంజీవి, హైద్రాబాద్పై ససేమీరా
న్యూఢిల్లీ: విభజన విషయంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి కూడా చేతులెత్తేసినట్లుగా కనిపిస్తోంది. ఆయన శనివారం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయి విభజనపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. పరీక్షలు అయ్యాయని, ఫలితాల కోసం వేచి చూడాల్సి ఉందని ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. సమైక్యాంధ్ర కోసం తమ ప్రయత్నాలు తాము చేశామని ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే, హైదరాబాద్ను కేవలం ఉమ్మడి రాజధాని చేస్తే సరిపోదని కచ్చితంగా కేంద్రపాలిత ప్రాంతం చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియాను కలిసి విన్నవించారు. హైదరాబాద్ను కనీసం కొన్నేళ్లపాటైనా కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని సోనియాను కోరినట్లు తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీ తరహాలో అసెంబ్లీ స్థానాలు కూడా కొనసాగించవచ్చునని సూచించానన్నారు. హెచ్ఎండిఎని శాశ్వత యూటీగా మార్చాలని, కనీసం కొత్తరాజధాని నిర్మాణం పూర్తి అయ్యేవరకైనా ఈ ఏర్పాటు కొనసాగాలని సీమాంధ్ర కేంద్ర మంత్రుల తరఫున సోనియాకు విన్నవించినట్లు వెల్లడించారు.

ఈ విషయంపై చర్చిస్తున్నామని, తుది నిర్ణయం తీసుకోలేదని సోనియా తనకు చెప్పారని చిరు తెలిపారు. సిడబ్ల్యూసి నిర్ణయాన్ని తాను వ్యతిరేకించడంలేదని, అయితే ప్రజల భావోద్వేగాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. యూటి చేయకుండా ఉమ్మడి రాజధాని ఆచరణీయం కాదన్నారు. సీమాంధ్రకూ, హైదరాబాద్కూ భౌగోళిక దూరం ఎక్కువని, చంఢీగఢ్ అంటే హర్యానా, పంజాబ్ రాష్ట్రాల మధ్య ఉంది కనుక అక్కడ ఉమ్మడి రాజధాని సాధ్యమైందన్నారు.
ఎక్కడో ఉండి మరెక్కడో ఉన్న ప్రాంతాన్ని పాలించడం అంత సులభం కాదని, రెండు రాష్ట్రాలను వేరు చేసి హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే అందరికీ సౌలభ్యంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. యూటి చేస్తారన్న నమ్మకం తనకుందన్నారు. మరో రెండు రోజుల్లో బిల్లు తయారవుతున్న దృష్ట్యా ప్రజల మనోభావాలను వ్యక్తపరిచేందుకు ఇదే అఖరి అవకాశంగా భావించి సోనియాను కలిసినట్లు తెలిపారు.
పరీక్ష రాయగానే ఫలితాలు చెప్పలేమని ఓ ప్రశ్నకు సమాధానంగా చిరు అన్నారు. హెచ్ఎండిఎని ప్రజాప్రతినిధులతో కూడిన యూటి చేయవచ్చునని, అప్పుడు మజ్లిస్ కూడా అంగీకరించవచ్చునని అభిప్రాయపడ్డారు. రాయల తెలంగాణ ప్రతిపాదన ఉందని, అయితే దానితో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తమని పదవులకు రాజీనామా చేయాలని ఎపిఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు చేసిన డిమాండ్పై చిరంజీవి అభ్యంతరం వ్యక్తం చేశారు.
అవసరమైతే అందరూ కలిసి కట్టుగా రాజీనామా చేయాలన్నారు. తామిప్పటికే రాజీనామా చేశామని, అశోక్ బాబు మాత్రం ఉద్యోగం చేస్తూ మమ్మల్ని విమర్శించడం ఎంతవరకు సమంజసమన్నారు. మరోవైపు బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై సిఎంతో మాట్లాడానని, భవిష్యత్తులో దీని వల్ల చాలా నష్టం కలుగతుందని చెప్పానని చిరంజీవి తెలిపారు.












Click it and Unblock the Notifications