ఏంటి?...చంద్రబాబు హయాంలోనే...టిడిపిలో ఇలా జరగడమా!;సీట్ల ఖరారుపై స్వీయ ప్రకటనలా?
అమరావతి:ఇటీవలి కాలంలో టిడిపిలో పార్టీ అధినేత చంద్రబాబు అభీష్టానికి వ్యతిరేకంగా పాలసీ మ్యాటర్లపైనే ధిక్కార ప్రకటనలతో పాటు ఏకంగా సీట్ల ఖరారుపై స్వీయ నిర్థారణల వరకు ఆపార్టీ నేతలు వచ్చేశారు. దీంతో టిడిపిలో ఇలా జరగడం ఏంటి?...ఆయన మారాడా?...లేక వాళ్లు మారారా?...
మొత్తానికి పార్టీ నేతల వ్యవహారశైలిలో మార్పయితే కనిపిస్తోందని...ఆ పార్టీ నేతలే కాదు ఇతర రాజకీయ శ్రేణులు కూడా ఆశ్చర్యపోతున్నాయంటే అతిశయోక్తి లేదు. (కారణాలు ఏమైనా కానీ) ఆది నుంచి తెలుగుదేశం పార్టీలో డిసిప్లిన్ ఎక్కువే...టిడిపి వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ హయాంలోనే కాదు...ఆ తరువాత పార్టీ పగ్గాలు చేపట్టిన చంద్రబాబు నేతృత్వంలోనూ ఆ పార్టీ పరిస్థితి అలాగే ఉండేది?...మరి ఇప్పుడు...ఈ మార్పు ఎందుకొచ్చింది?....వివరాల్లోకి వెళితే...
టిడిపిలో...క్రమశిక్షణ
ఒక్కప్పుడు టిడిపిలో చంద్రబాబు మాటే వేదవాక్కు!...ఆయనకు తెలియకుండా ఒక నిర్ణయం అటుంచి తమ అభిప్రాయం ప్రకటించడమే జరిగేది కాదు. అలాంటిది ఎన్నికల సీట్ల కేటాయింపుల గురించి ప్రకటనలా?...నో ఛాన్స్...అవన్నీ ఆయనే చూసుకుంటారు. మరి ఇటీవలి కాలంలో ఏం జరిగింది...కాంగ్రెస్ తో పొత్తు విషయం ఇంకా చంద్రబాబు ఏం చెప్పనే లేదు...నో ఇది కుదరదు...వద్దు...మేము ఊరుకోము...ఉరేసుకుంటాం అనేదాకా ముందు ముందే పార్టీ నేతలు రకరకాలుగా మాట్లాడటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అంతేనా ఆ విషయం మాట్లాడొద్దన్నా సరే...వుయ్ డోంట్ కేర్ అన్నట్లుగా మాట్లాడుతూనే ఉన్నారు టిడిపి నేతలు.
ఇటీవలి పరిణామాలు...చర్చనీయాంశం
ఇక తాజాగా అంతకంటే పరాకాష్ట లాంటి విషయం చోటుచేసుకుంది. మామూలుగా చంద్రబాబు అభ్యర్థుల పేర్లు ప్రకటన సస్పెన్స్ సినిమాను తలపిస్తుంది. చివరిదాకా ఎవరి పేరొస్తుందో వారికే తెలీని పరిస్థితి ఉంటుంది. ఒక్కోసారి అందరూ ఒకటనుకుంటే...బాబు గారి నుంచి వేరే నిర్ణయం వెలువడేది. షాక్ తిన్నా...ఖంగు తిన్నా...ఇంక అదే ఫైనల్...మరి ఇప్పుడు...ఫలానా సీట్లలో మేము పోటీ చేయబోతున్నామంటూ ఆ పార్టీ నేతలే ఇటీవల తమంతట తామే పేర్లు, స్థానాలు ప్రకటించేసుకున్నారు. అది చూసి ముందు ఆశ్చర్యపోయిన చాలా మంది నేతలు...ఇప్పుడు తాము కూడా అదే బాట పట్టాలని ఉవ్విళ్లూరుతున్నారట.
మార్పుకు...సంకేతమా?
నెల్లూరు పార్లమెంట్ స్థానానికి మాజీమంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి బొల్లినేని కృష్ణయ్య...తామే ఇక్కడ టిడిపి తరుపున అభ్యర్థులమంటూ ప్రకటించేసుకున్నారు. వారి వైఖరి చూస్తే ఇటీవల స్థానికంగా చెలరేగుతున్న పుకార్లకు ఫుల్ స్టాఫ్ పెట్టాలనే కృత నిశ్చయంతో అలా మాట్లాడినట్లు కనిపిస్తోంది. అయితే ఆ నిర్ణయాలను వారు సాధికారికంగా ప్రకటించుకున్న తీరు...ఇంక ఇదే ఫైనల్ అని చెప్పిన పద్దతి చూస్తే పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని వీరు పాటిస్తారా?...లేక వీరి మాటనే పార్టీ నాయకత్వం పాటిస్తుందా?...అనే సందేహం రాక మానదు.
మార్పు వచ్చింది...అంటున్నారు
అయితే ఒక్కసారిగా వీళ్లు ఇంత కాన్ఫిడెంట్ గా సీట్ల ప్రకటన చేయడం కూడా అందరినీ ఆశ్చర్యపరిచింది. టిడిపి అధినేత చంద్రబాబు మిగిలిన విషయాల్లో ఏమో కానీ సీట్ల ప్రకటన వంటి ఇలాంటి విషయాల్లో క్రమశిక్షణ ఉల్లంఘన అసలు సహించరు. ఆ విషయం అందరికీ తెలుసు...అదే జరిగితే కోరుకున్న సీటు దొరకడం అటుంచి అసలు టికెట్ దొరకడమే అసాధ్యం అయిపోతుంది. మరి అయినా వాళ్లు అలా ప్రకటన చేశారంటే?...ఏమై ఉంటుంది. ఒకవేళ అధినేతే వారితో అలా ప్రకటింపచేశారా?...అలా అయితే అధినేతలో మార్పు వచ్చినట్లే...లేదు అభ్యర్థులే వారంతట వాళ్లు ప్రకటించారా?...అంటే వారిలో అధినేత పట్ల తమ వ్యవహార శైలిలో మార్పు వచ్చినట్లే...పోనీ లోకేష్ ఏమైనా హామీ ఇచ్చి ఉంటారా?...అదీ పార్టీలో వచ్చిన మార్పును సూచిస్తుంది...సో ఎలా చూసినా ఇది టిడిపిలో మార్పునే సూచిస్తోందని కొందరు రాజకీయ పరిశీలకుల అభిప్రాయం.