ఎమ్మెల్సీ సీట్లన్నీ బీసీలకే...వైసిపి అధినేత జగన్ హామీ
పశ్చిమ గోదావరి:వైసిపి అధినేత కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తన పార్టీకి దక్కే ఎమ్మెల్సీ స్థానాలన్నీ బీసీలకు, ప్రాతినిధ్యంలేని కులాలకు ఇస్తానని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. వారి ప్రతి సమస్యను చట్టసభల్లో వచ్చే విధంగా కృషి చేస్తానని చెప్పారు.
ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్న జగన్ సోమవారం ఉదయం తన పాదయాత్రను చాగల్లు మండలం గౌడిపల్లి నుంచి ప్రారంభించి కొవ్వూరు వరకు కొనసాగించారు. అకిరాస కులం సభ్యులు ఏర్పాటు చేసిన కృతజ్ఞతా సమావేశంలో మాట్లాడుతూ బిసిలకు చట్ట సభల్లో ప్రాతినిథ్యం గురించి చెప్పారు. వైసీపీ అధికారంలోకి వస్తే అకిరాస కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానన్నారు. జగన్ పాదయాత్ర మంగళవారం తూర్పు గోదావరి జిల్లాలో ప్రవేశించనుంది.
కొవ్వూరు నియోజకవర్గంలోని గౌరపల్లి శివారు నుంచి 186 వ రోజు పాదయాత్రను ప్రారంభించిన వైఎస్ జగన్ అక్కడ నుంచి పసివేదల, నందమూరు క్రాస్ రోడ్డు, కొవ్వూరు ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ మీదుగా నందమూరు జంక్షన్కు వచ్చేటప్పటికి ఆయన పాదయాత్ర 2,300 కిలోమీటర్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఆయన మొక్క నాటారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ నాలుగేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన కొనసాగిస్తోందో అందరికి తెలిసిందేనని చెప్పారు. టిడిపి ప్రభుత్వం హయాంలో ఏ సంక్షేమ పథకం కావాలన్నా జన్మభూమి కమిటీ సిఫారసు చేయాల్సిందేనని ధ్వజమెత్తారు. ప్రజలకు కొద్దోగొప్పో పథకాలు ఇచ్చినా లంచాలు ఇవ్వాల్సిందేనన్నారు. ఇవన్ని తెరమరుగయ్యే రోజు త్వరలోనే వస్తోందని జగన్ చెప్పారు.
జగన్ పాదయాత్ర మంగళవారం సాయంత్రం తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభం కానుంది. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నుంచి గోదావరి రోడ్-రైలు వంతెన మీదుగా రాజమహేంద్రవరంలోకి ప్రవేశిస్తారు. అనంతరం కోటిపల్లి బస్టాండు సెంటర్లో ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. ఆ తరువాత పాదయాత్ర కొనసాగించి రాత్రికి రాజమహేంద్రవరంలోనే బస చేస్తారు.