పవన్ కళ్యాణ్ కోసం ఆరాటం, చంద్రబాబును అలా ఇరుకున పెట్టాలని జగన్!
పవన్ కళ్యాణ్తో జత కట్టేందుకు అన్ని పార్టీలు ఉవ్వీళ్లూరుతున్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీ ఇప్పటి నుంచే ఆయనను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు లేదా మరో రకంగా ఆయన మనసును గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
విజయవాడ: జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో జత కట్టేందుకు అన్ని పార్టీలు ఉవ్వీళ్లూరుతున్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీ ఇప్పటి నుంచే ఆయనను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు లేదా మరో రకంగా ఆయన మనసును గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
అధికార తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ నుంచి మొదలు పెడితే లెఫ్ట్ పార్టీల వరకు అలాగే ఉన్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కలిసి పని చేయాలని భావించనప్పటికీ.. ప్రజా సమస్యల పైన తమతో కలిసి రావాలని కోరుకుంటోంది. కాంగ్రెస్ పార్టీ కూడా సమస్యలపై పవన్ పోరాడితే మద్దతిస్తామంటోంది.

ఆరాటం
మొత్తానికి ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ హాట్ టాపిక్ అయ్యారు. ప్రధానంగా ప్రత్యేక హోదా పైన ఆయన వరుస సభలు పెడుతుండటంతో విపక్షాలు ఆయనను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.

తెలుగుదేశం పార్టీ
2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపులో పవన్ కళ్యాణ్ పాత్ర కూడా ఉంది. ఆయన వల్ల యువతతో పాటు కాపుల ఓట్లు కూడా పడ్డాయి. 2019లోను ఆయనను దూరం చేసుకోవద్దని చంద్రబాబు భావిస్తున్నారు. కాబట్టి ఆయన విమర్శలు చేసినప్పటికీ తెలుగు తమ్ముళ్లు సంయమనం పాటిస్తున్నారు. అంతేకాదు, ఆయన సూచనలను సానుకూలంగా తీసుకుంటున్నారు. అలా ప్రకటనలు కూడా చేస్తున్నారు. ఒకటి రెండుసార్లు హోదా విషయంలో ఎంపీలు కౌంటర్ ఇచ్చినా, చంద్రబాబు ఆదేశాలతో వెనక్కి తగ్గారు.

బీజేపీ
బీజేపీ కూడా పవన్ కళ్యాణ్ను దూరం చేసుకోవాలని ఏమాత్రం భావించడం లేదు. కానీ ప్రత్యేక హోదా విషయంలో అశక్తత వ్యక్తం చేసిన బీజేపీని ఆయన అదేపనిగా నిలదీస్తున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీ పవన్కు కౌంటర్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తోంది. హోదా ఇచ్చే పరిస్థితులు లేవు కాబట్టి, దాని బదులు ఇచ్చిన ప్యాకేజీ పైన పవన్ సంతృప్తి చెందితే.. బీజేపీకి అంతకుమించిన సంబరం ఉండదని అంటున్నారు. కానీ బీజేపీతో దాదాపు తెగతెంపులు జరిగినట్లే భావించవచ్చునని అంటున్నారు. లెఫ్ట్ పార్టీ నేతలతో చర్చల వెనుక కూడా బీజేపీకి పూర్తిగా దూరం అయ్యారని చెప్పడానికి నిదర్శనమంటున్నారు.

లెఫ్ట్
పవన్ కళ్యాణ్ ఇటీవల లెఫ్ట్ పార్టీ నేతలతో భేటీ అయ్యారు. దీంతో ఏపీలో కొత్త పొత్తుల పైన చర్చలు సాగుతున్నాయి. పొత్తుల పైన మాట్లాడలేదని, ప్రజా సమస్యల పైన చర్చించామని సిపిఐ నేత రామకృష్ణ ఆ రోజే చెప్పారు. తాజాగా, ఆదివారం కూడా ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారానికి లెఫ్ట్ - జనసేన పార్టీ అజెండా ఒకటిగానే ఉందని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో కలిసి పని చేయడంపై ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు.

పవన్తో బాబును ఇరికించాలని జగన్
కాంగ్రెస్, వైసిపిలు పవన్ కళ్యాణ్ తమతో కలుస్తారని ఏమాత్రం భావించడం లేదని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ కంటే వైసిపి ఇంకా అసలు ఏమాత్రం ఆ ఆశలు పెట్టుకోలేదు. కానీ ప్రజా సమస్యల పైన తమతో కలిసి రావాలని జనసేనను కోరుతున్నారు. అలా చేస్తే చంద్రబాబు ప్రభుత్వాన్ని మరింత ఇరుకున పెట్టాలని జగన్ చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా హోదా వంటి వాటి పైన పవన్కు మద్దతు పలుకుతోంది.












Click it and Unblock the Notifications