ఏపీలో ఆ ఎంపీ సీటు చాలా హాట్ గురూ..!
ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. మరికొద్ది నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరుగనున్నాయి. అధికారం కోసం అన్ని రాజకీయ పార్టీలు శరవేగంగా పావులు కదుపుతున్నాయి. దీంతో అన్ని రాజకీయ పార్టీలు గెలుపుపై ఫోకస్ పెట్టాయి. అయితే ప్రస్తుతం ఏపీలో ఓ ఎంపీ సీటు అన్ని రాజకీయ పార్టీలకు హాట్ కేక్లా మారింది. విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి రాజకీయ నేతలు క్యూ కడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలంటే విశాఖ జిల్లా కీలకంగా మారింది.

ఉమ్మడి విశాఖ జిల్లా ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉండేది. కాని 2019 ఎన్నికల్లో ఇక్కడ పూర్తిగా వైసీపీ హవా నడిచింది. ఎంపీ స్థానంతో పాటు, మెజార్టీ ఎమ్మెల్యే స్థానాలను జగన్ నేతృత్వంలోని వైసీపీ కైవసం చేసుకుంది.రాజధానిని విశాఖకు తరలించడం ద్వారా 2019 ఎన్నికల ఫలితాలే వస్తాయని అధికార పార్టీ భావిస్తోంది. ఇదే సమయంలో విశాఖలో టీడీపీ పూర్వవైభవాన్ని చూపించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఇక్కడ నుంచి జనసేన పార్టీ కూడా తమ సత్తా చాటాలని చూస్తోంది.ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ గాజువాక పర్యటన సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

గాజువాక నుంచి కచ్చింతంగా జనసేన అభ్యర్థి బరిలో ఉంటారని పవన్ స్పష్టం చేశారు. విశాఖ ఎంపీ స్థానం టీడీపీ గెలవాలంటే..ఆ పార్టీకి జనసేన మద్దతు తప్పనిసరిగా మారింది. ఇలా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల ముందే విశాఖపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుత సిట్టింగ్ ఎంపీగా ఎంవీఎస్ సత్యనారాయణ కొనసాగుతున్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం. ఎంవీఎస్ సత్యనారాయణ విశాఖ తూర్పు నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం. దీంతో అధికార పార్టీ నుంచి విశాఖ ఎంపీగా కొత్త వ్యక్తి బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తుంది. వైసీపీ నుంచి ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడు ఎంపీగా పోటీ చేస్తారనే గుస గుసలు వినిపిస్తున్నాయి.

గత కొన్నేళ్లుగా విశాఖలో పట్టు బిగించేందుకు విజయ్ సాయి రెడ్డి ప్రయత్నిస్తూ వస్తున్నారు. అది అల్లుడు కోసమేనని టాక్ వినిపిస్తోంది. ఇక టీడీపీ నుంచి బాలకృష్ణ చిన్న అల్లుడు శ్రీ భరత్ బరి ఉంటారు.2019 ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేసిన ఆయన ,వైసీపీ అభ్యర్థి ఎంవీఎస్ సత్యనారాయణ చేతిలో అతి తక్కువ మెజార్టీతో ఓడిపోయారు. అందుకే మరోసారి శ్రీ భరత్నే విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయిస్తారని ప్రచారం జరుగుతోంది.

ఇక బీజేపీ కూడా విశాఖ ఎంపీ సీటుపై చాలా ఆశలు పెట్టుకుంది.2014 ఎన్నికల్లో విశాఖ ఎంపీ స్థానాన్ని టీడీపీ అండతో బీజేపీ గెలుచుకుంది. 2024 ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్ నుంచి బరిలోకి దిగడానికి ఇద్దరూ నేతలు పోటీ పడుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహం ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. జేడీ లక్ష్మీనారాయణ సైతం విశాఖ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇలా అన్ని రాజకీయ పార్టీలకు విశాఖ సీటు హాట్ కేక్లా మారింది. మరి వీరిలో ఎవరికి విజయం దక్కుతుందో చూడాలి.












Click it and Unblock the Notifications