ఆజిల్లాలో వైసీపీ వాషౌట్, జగన్ భజనకు ఒక్కడూ మిగల్లేదు, జడ్పీ చైర్మన్ పద్మశ్రీ జంప్
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ పరిస్థితి మరీ దారుణంగా తయారైయ్యింది. కొన్ని జిల్లాల్లో వైసీపీ నాయకులు వరస రాజీనామాలతో ఆ పార్టీ హై కమాండ్ షాక్ అవుతోంది. ఏలూరు జిల్లాలో వైసీపీ దాదాపు ఖాళీ కావడంతో ఆ పార్టీ నాయకులు బిత్తరపోతున్నారు. ఏలూరులో పడిన దెబ్బకు వైసీపీకి చెందిన క్యాడర్ అయోమయంలో పడిపోంది.
పశ్చిమ గోదావరి ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ గంటా పద్మశ్రీ, ఆమె భర్త, వైసీపీ ఏలూరు జిల్లా బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఘంటా ప్రసాదరావు వైసీపీకి రాజీనామా చేశారు. జడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ దంపతులు వారి రాజీనామా లేఖలను వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు పంపించారు. వ్యక్తిగత కారణాలతో మేము వైసీపీకి రాజీనామాలు చేస్తున్నామని ఏలూరు జడ్పీ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఆమె భర్త, ఏలూరు జిల్లా బీసీ సెల్ వైసీపీ విభాగం అధ్యక్షుడు ప్రసాదరావు మీడియాకు చెప్పారు.

ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, ఏలూరు మేయర్ నూర్జహాన్ ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు వారి దారిలోనే ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ గంటా పద్మశ్రీ కూడా వైసీపీకి రాజీనామా చేయడంతో ఆ జిల్లాలోని వైసీపీ కార్యకర్తలు హడలిపోతున్నారు. ఏలూరు జిల్లాలో ముఖ్య నేతలైన ఇడా మాజీ చైర్మన్ శ్రీనివాస్, ఏలూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మైబాబు ఇటీవల వైసీపీకి రాజీనామా చేశారు.
ఏలూరు నగరపాలక సంస్థలో వైసీపీకి చెందిన 19 మంది కార్పొరేటర్లు ఆ పార్టీకి రాజీనామా చేసి ఇటీవల టీడీపీలో చేరారు. ఇక మేయర్ నూర్జహాన్ దంపతులు ఇటీవల సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. మరో 15 మంది కార్పొరేటర్లు కూడా త్వరలో వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరడానికి సిద్దంగా ఉన్నారని సమాచారం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 48 మంది జడ్పీటీసీ సభ్యులు ఉన్నారు. టీడీపీ నుంచి ఉప్పలపాటి సురేష్ బాబు, జనసేన నుండి జయప్రకాష్ నాయుడు మాత్రమే జడ్పీటీసీ సభ్యులుగా ఉన్నారు.

మిగిలిన 46 మంది వైసీపీకి చెందిన జడ్పీటీసీ సభ్యులే ఉన్నారు. జడ్పీ చైర్మన్ పద్మశ్రీ రాజీనామాతో జిల్లా జడ్పీ చైర్మన్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్పర్సన్ పద్మశ్రీ దంపతులు జనసేనలో చేరుతామని ప్రకటించారు. తమ వ్యక్తిగత కారణాలతోనే వైసీపీకి రాజీనామా చేశామని జడ్పీ చైర్మన్ ఘంటా పద్మశ్రీ, గంటా ప్రసాద్ రావు దంపతులు మీడియాకు చెప్పారు.
పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గ్రామీణ ప్రాంతాలను ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేస్తున్నారని, ఆయన నేతృత్వంలోనే పనిచేయాలని నిర్ణయించుకొని వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, జడ్పీ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేశానని, త్వరలోనే జనసేనలో చేరుతామని ఘంటా పద్మశ్రీ వివరించారు. మొత్తం మీద ఏలూరు జిల్లాలో వైసీపీ నాయకులు మొత్తం ఖాళీ అయిపోవడంతో ఆ పార్టీ హైకమాండ్ కోసం భజన చెయ్యడానికి నాయకులు కరువు అయ్యారని తెలిసింది.












Click it and Unblock the Notifications