మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి సర్వం సిద్ధం: సచివాలయంలో పండగ వాతావరణం
అమరావతి: మరి కొన్ని గంటలు! రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వంలో మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. రాజధాని అమరావతి ప్రాంతంలోని వెలగపూడిలో గత ప్రభుత్వం తాత్కాలికంగా నిర్మించిన సచివాలయం ప్రాంగణంలోనే మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
మొత్తం 25 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్.. వారితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఉదయం 11:49 నిమిషాలకు ప్రమాణ స్వీకారోత్సవం ఆరంభం అవుతుంది. అనంతరం- పలువురు మంత్రులు అదేరోజు సచివాలయంలోని తమ ఛాంబర్లలో బాధ్యతలను స్వీకరిస్తారు.
కొత్త మంత్రుల శాఖల కేటాయింపునకు సంబంధించిన ఉత్తర్వులు అదేరోజు మధ్యాహ్నానికి వెలువడే అవకాశాలు ఉన్నాయి. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పురస్కరించుకుని- వెలగపూడి సచివాలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. సచివాలయంలో పండగ వాతావరణం నెలకొంది. సందడిగా మారింది.
సచివాలయ భవనాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. పలువురు మంత్రులు బాధ్యతలను స్వీకరించబోతున్నందున.. వారి ఛాంబర్లను పూల మాలలతో సుందరీకరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఛాంబర్ కూడా సరికొత్త రూపాన్ని సంతరించుకుంటోంది.