జూన్ 7 నుంచి పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి... మంత్రి సురేష్ కీలక ప్రకటన...
ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ ప్రకారం జూన్ 7 నుంచి పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. ఇంకా మూడు వారాల సమయం ఉన్నందునా అప్పటి పరిస్థితులను బట్టి పరీక్షల నిర్వహణపై నిర్ణయం ఉంటుందన్నారు. ఈ నెలాఖరు వరకు విద్యార్థులకు సెలవులు ఉంటాయని... విద్యార్థులు ఇప్పుడున్న షెడ్యూల్ని దృష్టిలో పెట్టుకుని పరీక్షలకు ప్రిపేర్ కావాలని సూచించారు. జూన్ 1 నుంచి టీచర్లు స్కూళ్లకు రావాల్సి ఉంటుందని మంత్రి సురేష్ తెలిపారు.
Recommended Video
కరోనా నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్య భద్రతతపై ప్రభుత్వం నూటికి నూరు శాతం పట్టింపుతో ఉందన్నారు. కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూనే పరీక్షలను నిర్వహిస్తామని చెప్పారు. 'కరోనా సెకండ్ వేవ్ తర్వాత థర్డ్ వేవ్ రాదన్న గ్యారెంటీ లేదు... కర్ణాటకలో పదో తరగతి పరీక్షలు షెడ్యూల్ ప్రకారం నిర్వహించనున్నారు... కేరళ,బిహార్ రాష్ట్రాల్లో ఇప్పటికే పరీక్షలు పూర్తి చేశారు.. కాబట్టి ప్రతిపక్షాలు అనవసరంగా విద్యార్థులు,తల్లిదండ్రుల్లో పరీక్షల పట్ల లేనిపోని భయాందోళనలు రేకెత్తించవద్దు.' అని తెలిపారు. పదో తరగతిలో గ్రేడింగ్ లేకపోతే విద్యార్థులకు చాలా నష్టం వాటిల్లుతుందని చెప్పారు.

ప్రిపరేషన్లో ఉన్న విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం పెద్ద పని కాదు... కానీ పరీక్షలు లేవని చెప్పి నిర్వహించడం సరికాదు... అని మంత్రి సురేష్ పేర్కొన్నారు. కాబట్టి ప్రతిపక్షాలు కూడా అనవసర విమర్శలు మానుకుని నిర్మాణాత్మకమైన సలహాలు,సూచనలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
నిజానికి ఏపీలో మార్చి 31 నుంచి ఏప్రిల్ 17 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రభుత్వం పరీక్షలను వాయిదా వేయక తప్పలేదు. అటు ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ముందస్తు షెడ్యూల్ ప్రకారం మే 5 నుంచి 23 వరకు పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ కరోనా నేపథ్యంలో వాయిదా పడక తప్పలేదు. త్వరలోనే విద్యాశాఖ ఇంటర్మీడియట్ పరీక్షలపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications