టీడీపీతో పొత్తుపై ఇప్పుడే చెప్పలేం, ప్రతీ పైసాకి చంద్రబాబు లెక్క చెప్పాల్సిందే : పురంధరేశ్వరి
విజయవాడ : ప్రత్యేక హోదా విషయం మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీలకు పెద్ద సవాల్ గానే పరిణమించింది. అటు జనం నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలో టీడీపీ నేతలు బీజేపీని విమర్శించడం, స్తబ్దుగా ఉంటే రాష్ట్రంలో పార్టీ మైలేజ్ ఎక్కడ దిగజారుతుందోనని సోము వీర్రాజు లాంటి బీజేపీ నేతలు టీడీపీ పై కౌంటర్ ఎటాక్ చేయడం తెలిసిన విషయమే.
ఈ నేపథ్యంలోనే భవిష్యత్తులో రెండు పార్టీల మధ్య మిత్రపక్ష సంబంధాలు కొనసాగుతాయా..! లేదా..! అన్న డైలామా కొనసాగుతోంది. తాజాగా దీనిపై స్పందించిన బీజేపీ నేత పురంధరేశ్వరి వచ్చే దఫా ఎన్నికల్లో టీడీపీతో మిత్రపక్షంగా కొనసాగేది లేనిది ఇప్పడే చెప్పలేమని తేల్చేశారు.
కేంద్రం ఆర్థిక సహాయంపై టీడీపీ చేస్తోన్న ఆరోపణలను కొట్టిపారేశారు పురంధేశ్వరి. కేంద్రం నుంచి అందిన
సహాయాన్ని రూపాయితో సహా లెక్క గట్టి మరీ ప్రజల ముందుంచాలని, ఈ తర్వాతే విమర్శలకు పని చెప్పాలని సీఎం చంద్రబాబు నాయుడుకి సూచించారు. రాజధాని కోసం కేంద్రం ఇచ్చిన నిధులను ఏం చేశారన్న దానిపై ఇప్పటికీ క్లారిటీ లేదన్నారు. అమరావతి నిధులన్ని టీడీపీ నేతలే పక్కదారి పట్టించారని ఆరోపించారు.

ఏపీకి కేంద్రమంత్రుల రాక సందర్భంగా,విజయవాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో పురందేశ్వరి ఈ వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో బీజేపీని బలోపేతం చేసే దిశగానే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పిన పురందేశ్వరి, రాష్ట్ర ప్రయోజనాలన్నింటి పైనా బీజేపీ దృష్టి సారించిందని తెలిపారు. హోదా విషయంలో పార్టీపై వస్తోన్న ఆరోపణలను పురంధేశ్వరి ఖండించారు.
14వ ఆర్థిక సంఘం సిఫార్సులు, ఏపీ ప్రత్యేక హోదాకి అనుకూలంగా లేవని, దీంతో హోదా సాధ్యమవడం లేదన్నారు. రాష్ట్ర సంక్షేమం అభివృద్ది విషయాల్లో కేంద్రం చేస్తోన్న సహాయం పట్ల క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పిస్తామన్నారు.
ప్రాజెక్టులను పూర్తి చేస్తాం : కంభంపాటి హరిబాబు
ఏపీకి కేంద్రం చేస్తోన్న సహాయంపై స్పందించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కంభంపాటి హరిబాబు. విభజన చట్టంలో పొందుపర్చిన హామీల్లో కేంద్రం ఇప్పటికే చాలా వరకు అమలు పరిచిందన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇప్పటివరకు రూ.1.43వేల కోట్ల ఆర్థిక సహాయం అందిందిని, రాష్ట్ర ఆర్థిక స్థితికి ఇది ఎంతో ఉపయోగకరమన్నారు.
రాష్ట్ర ప్రాజెక్టులన్ని పూర్తి చేసే విషయంలో కేంద్రం చిత్తశుద్దితో ఉందని, కేంద్రం నుంచి మంజూరైన ప్రాజెక్టులన్ని త్వరలోనే కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకుంటామని ఇందుకోసం అందరి సహకారం కావాలన్నారు. కేంద్రం మార్గదర్శకాలను అనుసరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రాజెక్టుల విషయంలో కేంద్రంతో కలిసి ముందుకు వెళ్లాలన్నారు. రాష్ట్రంలో 24 గంటల నిరంతర విద్యుత్ అందించేందుకు కేంద్రం ఎన్నో ప్రాజెక్టులు చేపడుతోందని తెలిపారు.












Click it and Unblock the Notifications