సోము వీర్రాజు వీరంగం, వైసీపీ స్లిప్పులు.. పోలీసులు వాళ్ల వైపే?, ఎస్ఐపై వేటు..
కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో స్వల్ప ఉద్రిక్తతలు, గందరగోళం చోటు చేసుకున్నాయి. మంగళవారం ఉదయం 7గం.కు మొదలైన పోలింగ్ సాయంత్రం 5గం. వరకు జరగనుంది.
కాకినాడ: కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో స్వల్ప ఉద్రిక్తతలు, గందరగోళం చోటు చేసుకున్నాయి. మంగళవారం ఉదయం 7గం.కు మొదలైన పోలింగ్ సాయంత్రం 5గం. వరకు జరగనుంది. మొత్తం 48వార్డులకు గాను 248మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. 2,29,373మంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు.
టీడీపీ 39వార్డుల్లోను, మిత్రపక్షం బీజేపీ 9వార్డుల్లోను పోటీ చేస్తున్నాయి. ఇక వైసీపీ 48వార్డుల్లో అభ్యర్థులను నిలిపింది. 17వార్డుల్లో కాంగ్రెస్, చెరో 4వార్డుల్లో సీపీఎం, సీపీఐ బరిలో ఉన్నాయి. ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతున్నప్పటికీ.. పలు చోట్ల నాయకుల అత్యుత్సాహం వల్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.
సోము వీర్రాజు వీరంగం:
బీజేపీ ఎమ్మెల్యే సోము వీర్రాజుకు వైసీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలింగ్ సందర్భంగా డబ్బులు పంపిణీ చేస్తున్నారంటూ కొంతమంది బీజేపీ నేతలను వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో.. సోము వీర్రాజు రంగంలోకి దిగారు.
9వ డివిజన్ వద్ద వైసీపీ కార్యకర్తలతో ఆయన వాగ్వాదానికి దిగారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకోగా పోలీసులు ఇరు వర్గాలకు నచ్చజెప్పారు. బీజేపీ నేతలు ఓటర్లను ప్రలోభపెడుతున్నారని వైసీపీ శ్రేణులు ఆరోపించాయి. టీడీపీ నేతలు యథేచ్చగా ఎన్నికల కోడింగ్ ఉల్లంఘించి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
టీడీపీ ఎమ్మెల్యే వాగ్వాదం:
14,15డివిజన్లలోని పోలీసులతో పిఠాపురం టీడీపీ ఎమ్మెల్యే వర్మ వాగ్వాదానికి దిగినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే 4వ డివిజన్ టీడీపీ అభ్యర్థి వనమాడి ఉమాశంకర్ పోలింగ్ కేంద్రాలలో ప్రచారం చేస్తున్నారని వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అదే 4వ డివిజన్ పరిధిలో బీజేపీ అభ్యర్థి తోట నాగలక్ష్మి ఎలక్షన్ కోడ్ నిబంధనలకు విరుద్దంగా బూత్ లోకి వెళ్లి ప్రచారం చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దానిపై వివాదం:
అధికారులు కాకుండా అనధికారులు, ఇతరులు పోలింగ్ బూత్ల్లోకి వెళ్లడం వివాదాస్పదమవుతోంది. పోలీసులు వారిని అదుపు చేయకపోవడంతో వైసీపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఈవీఎంలపై నోటా ఆప్షన్ లేకపోవడం గందరగోళానికి గురిచేసింది.
కురసాల కన్నబాబు ఆగ్రహం:
తూర్పు గోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు పోలీసులు తీరుపై మండిపడ్డారు. పార్టీ నేతలను బెదిరిస్తూ అధికార పార్టీ సభ్యులకు మద్దతునిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలతో గుడారిగుంట 3వ డివిజన్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాకినాడలో ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతున్న క్రమంలో టీడీపీ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది.
పరస్పర ఆరోపణలు, పోలీసులు వాళ్ల వైపే?:
పోలింగ్ ప్రారంభమైన తర్వాత కాకినాడలోని పలువార్డుల్లో వైసీపీ-టీడీపీ, వైసీపీ-బీజేపీ నేతలు, కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వైసీపీ కార్యకర్తలు ఓటర్లకు స్లిప్పులు పంచుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
వైసీపీకి అనుకూలంగా ఎస్ఐ వ్యవహరిస్తున్నారంటూ కాకినాడ టీడీపీ నేతలు ఈసీ, ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇందుకు స్పందించిన ఈసీ, పోలీసు ఉన్నతాధికారులు ఎస్ఐను ఎన్నికల విధుల నుంచి తొలగించారు. 38వ వార్డులో వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తుండటంతో ఎస్ఐపై వేటు పడింది.
మరోవైపు పోలీసులంతా టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. బూత్ల్లోకి ఎవరు వెళ్లిన పట్టించుకోవడం లేదని, ఎన్నికలవేళ ప్రచారం చేయవద్దని తెలిసినా చూసీ చూడనట్లు వదిలేస్తున్నారని అంటున్నారు,