ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్లోకి అమరరాజా బ్యాటరీస్: మొదటి అడుగు ఇలా
హైదరాబాద్: దిగ్గజ బ్యాటరీల తయారీ సంస్థ అమరరాజా(Amara Raja Batteries) కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్ ద్విచక్ర వాహన విభాగంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించింది. తొలుత ఛార్జర్లు, తర్వాత బ్యాటరీల ద్వారా ఈ విభాగంలోకి ప్రవేశించాలనుకుంటోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో తమ లిథియం ఆయాన్ బ్యాటరీ వ్యాపారాన్ని మూడింతలు చేయాలన్న లక్ష్యంలో భాగంగా ఈ అడుగులు వేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
వాహన, టెలికాం, రక్షణ రంగాలకు రెండు దశాబ్దాలకు పైగా బ్యాటరీలను అమరరాజా బ్యాటరీస్ ఉత్పత్తి చేస్తోంది. అమరాన్(Amaron) పేరిట వాహన బ్యాటరీలను విక్రయిస్తోంది. ప్రస్తుతం త్రీ వీలర్ ఈవీ మార్కెట్లో అమరరాజాకు కస్టమర్లు ఉన్నారు. అయితే, లిథియం అయాన్ బ్యాటరీ వ్యాపారం ద్వారా 2.5 శాతం మాత్రమే ప్రస్తుతం కంపెనీకి సమకూరుతోంది.

మిగతా రూ.10,385 కోట్ల ఆదాయం ఫ్లాగ్ షిప్ లెడ్ యాసిడ్ స్టోరేజీ బ్యాటరీల ద్వారా సమకూర్చుకుంది. ఈ నేపథ్యంలో ద్విచక్ర ఈవీ మార్కెట్లోకి ప్రవేశించాలనుకుంటోంది. ముందుగా ఛార్జర్లు, తర్వాత బ్యాటరీ ప్యాక్ల ద్వారా న్యూ ఎనర్జీ విభాగాన్ని విస్తరించాలని భావిస్తున్నట్లు సమాచారం.
కాగా, అమరరాజా బ్యాటరీస్ తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లి వద్ద లిథియం సెల్-బ్యాటరీ ప్యాక్ తయారీకి అతిపెద్ద కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తోంది. అమరరాజా గిగా కారిడార్ పేరుతో ఏర్పాటు చేస్తున్న ఈ కర్మాగారానికి ఇటీవలే శంకుస్థాపన కూడా జరిగింది. ఏడాదిన్నరలో దీన్ని పూర్తి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లిథియం ఆయాన్ బ్యాటరీల ద్వారా వ్యాపారాన్ని మూడు రెట్లు పెంచుకోవాలని భావిస్తున్నట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విక్రమాదిత్య గౌరినేని చెప్పారు. లిథియం అయాన్ బ్యాటరీల తయారీకి అవసరమైన టెక్నాలజీ బదిలీ కోసం పలు గ్లోబల్ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications