అమరరాజా ప్రస్థానం ప్రత్యేకం-ఏపీ నుంచి వెళ్లిపోవటం : ఆ భూములు వాడలేదు-ఛైర్మన్ కీలక స్పందన..!!
కొద్ది రోజులుగా చిత్తూరు జిల్లాలోని అమరరాజా గ్రూపు సంస్థలు తమిళనాడుకు తరలి వెళ్తున్నాయనే ప్రచారం సాగుతోంది. ప్రభుత్వ వేధింపుల కారణంగానే ఆ సంస్థ ఏపీ నుంచి వెళ్లిపోవాలనే నిర్ణయానికి వచ్చిందని కధనాలు వచ్చాయి. దీని పైన అటు ప్రభుత్వం..అధికార పార్టీ- ప్రతిపక్షాల నుంచి రకరకాల స్పందనలు వ్యక్తం అయ్యాయి. అయితే, దీని పైన ఇప్పటి వరకు అమరరాజా సంస్థల నుంచి అధికారికం గా ఎటువంటి స్పందన రాలేదు. ఇక, ఇప్పుడు ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు గల్లా రామచంద్రనాయుడు మీడియా ముందుకొచ్చారు.
అమరరాజా పరిశ్రమది 36 ఏళ్ల ప్రయాణమన్నారు. తాను తన తండ్రి నుంచి ధైర్యం..మామ రాజగోపాలనాయుడు స్పూర్తితో ప్రజా సేవలోకి వచ్చామని చెప్పుకొచ్చారు. పరిశ్రమల కోసం సాగుభూమిని వాడకూడదనే నిబంధన పెట్టుకున్నామని వివరించారు. పిచ్చి మొక్కలతో నిండిన భూమిని పచ్చదనంతో నింపామన్నారు. పిచ్చి మొక్కలతో నిండిన భూమిని పచ్చదనంతో నింపామన్నారు. 1985లో చిన్న గ్రామం కరకంబాడిలో పరిశ్రమ విస్తరించామని నాయుడు చెప్పుకొచ్చారు. తమ ప్లాంట్లన్నీ గ్రామాల్లోనే ఏర్పాటు చేశామన్నారు.

కరకంబాడిలో రూ.2 కోట్లతో 22 మందితో పరిశ్రమ ప్రారంభం అయిందని.చిత్తూరు జిల్లాలో రూ.6 వేల కోట్ల స్థాయికి విస్తరించామని వివరించారు. ఎప్పటికప్పుడు టెక్నాలజీని అభివృద్ధి చేసుకుంటూ అత్యుత్తమైన ఉత్పత్తులు అందిస్తూ వచ్చామని..ఎకానమీ అభివృద్ధికి కృషి చేశామని చెబుతూనే...విద్యార్హత లేనివారికి కూడా ఉద్యోగాలిచ్చామని చెప్పారు. మేం సమాజాభివృద్ధిని కోరుకున్నామని స్పష్టం చేసారు. సొసైటీ కోసం మొదటిసారిగా మేమే ట్రస్టు కూడా ఏర్పాటు చేశామని వివరించారు. 1990లో తొలిసారి ఆధునిక సాంకేతికతను దేశంలో ప్రవేశపెట్టామన్నారు.
అంతర్జాతీయ ప్రమాణాల మేరకు ఉత్పత్తుల తయారీ..తమ సంస్థల్లో ఇప్పుడు 18 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించామని చెప్పుకొచ్చారు. తమ సంస్థల ద్వారా సుమారు 60 వేల మందికి పరోక్ష ఉపాధి
లభించిందని..చదువుతో సంబంధం లేకుండా శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించామని వివరించారు. ఇక, తాజా వివాదం పైన స్పందించటానికి ఆయన నిరాకరించారు. పీసీబీ ఆరోపణలపై నేనెలాంటి వ్యాఖ్యలు చేయనని, ఆ విషయం కోర్టు పరిధిలో ఉందని రామచంద్రనాయుడు తెలిపారు.
జిల్లాను, గ్రామాన్ని అభివృద్ధి పరచాలన్న లక్ష్యంతో ముందుకు వచ్చామన్నారు. పరిస్థితులను బట్టి ఎలా ముందుకు వెళ్లాలన్నదానిపై నిర్ణయం తీసుకుంటామని రామచంద్రనాయుడు ప్రకటించారు. దేశవ్యాప్తంగా 16 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లలో ఉత్పాదన కొనసాగుతోందన్నారు. తాను రాజకీయ వేత్తను కాదని, సామాజిక సేవకు మాత్రమే ప్రాధాన్యతనిస్తానని గల్లా రామచంద్రనాయుడు వివరించారు.












Click it and Unblock the Notifications