అమరావతిలో టర్నింగ్ పాయింట్ ? 75 కి.మీల కాషాయ పాదయాత్ర-టీడీపీ,బీజేపీ మధ్యలో జగన్ ?
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి రాజధాని స్ధానంలో మూడు రాజధానుల్ని తెరపైకి తెచ్చింది. అయితే దీనిపై స్ధానికంగా అప్పటికే రాజధాని కోసం భూములిచ్చిన రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అయినా పట్టించుకోకుండా ముందుకెళ్లిన వైసీపీ సర్కార్ కు హైకోర్టు బ్రేకులేసింది. అయితే ఇప్పటికీ జగన్ సర్కార్ మూడు రాజధానులపై ముందుకెళ్తామనే చెబుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అమరావతినే నమ్ముకున్న టీడీపీకి బీజేపీ నుంచి ఓ సవాల్ ఎదురుకాబోతోంది. ఇది అంతిమంగా ఈ ప్రాంతంలో టర్నింగ్ పాయింట్ కానుంది.

అమరావతిలో ఛాంపియన్ రేస్
అమరావతిలో రాజధాని పెట్టాలని నిర్ణయించింది చంద్రబాబు ఆధ్వర్యంలోని గత టీడీపీ సర్కార్ అయితే.. దానికి మద్దతుగా నిలిచింది కేంద్రంలోని మోడీ సర్కార్. దీంతో అమరావతిలో రాజధానికి ప్రధాని మోడీ శంఖుస్ధాపన చేశారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక మూడు రాజధానుల చర్చ తీసుకురావడంతో దీనిపై రాష్ట్ర బీజేపీలో చీలిక కనిపించింది. ఆరంభంలో అమరావతిని లైట్ తీసుకున్న బీజేపీ నేతల్ని అమిత్ షా తన హెచ్చరికలతో దారికి తెచ్చారు. దీంతో ఇప్పుడు అమరావతికి వ్యతిరేకంగా బీజేపీలో ఎవరూ మాట్లాడే పరిస్ధితి లేదు. అదే సమయంలో ఇక్కడ ఛాంపియన్ గా ఉన్న టీడీపీని ఢీకొట్టేందుకు బీజేపీ సిద్ధమవుతోంది.

అమరావతిలో బీజేపీ పాదయాత్ర
అమరావతిలో ఇప్పటికే ఛాంపియన్ గా ఉన్న టీడీపీని ఢీకొట్టేందుకు బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. అమిత్ షా సూచనలతో రంగంలోకి దిగిన బీజేపీ నేతలు.. అమరావతికి మద్దతుగా ఇప్పటికే వరుసగా ప్రకటనలు చేస్తున్నారు. అంతేకాదు గతంలో రైతులు చేపట్టిన పాదయాత్రకు, తిరుపతి సభకు కూడా అండగా నిలిచారు. ఇప్పుడు ఏకంగా అమరావతి గ్రామాల్లో పాదయాత్ర చేపట్టబోతున్నారు. రేపటి నుంచి ఈ పాదయాత్ర ప్రారంభం కానుంది. గుంటూరు జిల్లా బీజేపీ యూనిట్ చేపట్టే ఈ పాదయాత్రలో బీజేపీ నేతలంతా పాల్గొనబోతున్నారు.

బీజేపీ పాదయాత్ర ఇలా..
మనం-మన అమరావతి పేరుతో బీజేపీ ఈ పాదయాత్ర చేపట్టబోతోంది. అమరావతికి మద్దతుగా పాదయాత్ర చేపడుతున్నట్లు బీజేపీ ప్రకటించింది. బిజెపి గుంటూరు జిల్లా పార్టీ ఆధ్వర్యంలో 29 నుండి 4 వరకూ రాజధాని గ్రామాల్లో పాదయాత్ర ఉంటుందని ఆ పార్టీ నేత పాటిబండ్ల రామకృష్ణ ప్రకటించారు. రాజధాని గ్రామాల్లో 75 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర సాగబోతోంది. ఈనెల 29న తాడేపల్లి మండలం ఉండవల్లిలో ఈ యాత్ర ప్రారంభమవుతుంది.
తొలిరోజు రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ ఇందులో పాల్గొంటారు. .
ఈ పాదయాత్రలో అమరావతి ప్రజలు ఇచ్చే ఫీడ్ బ్యాక్ ను కేంద్రానికి అందిస్తామని రాష్ట్ర నేతలు చెప్తున్నారు. చివరి రోజైన ఆగస్టు 4వ తేదీ తుళ్ళూరులో జరిగే బహిరంగ సభతో పాదయాత్ర ముగుస్తుంది.

టర్నింగ్ పాయింట్ ఎలా ?
అమరావతిలో ఇప్పటికే ఛాంపియన్ గా ఉన్న టీడీపీతో పోటీ పడి బీజేపీ గెలవడం అంత సులువు కాదు. కానీ కేంద్రం చేతుల్లో ఉన్న అమరావతి ఏకైక రాజధాని అంశంపై మాత్రం బీజేపీ పాత్ర కీలకంగా ఉండటంతో ఇక్కడి ప్రజలు ఇచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా కేంద్రం తీసుకునే నిర్ణయాలు ఓ టర్నింగ్ పాయింట్ ఇస్తాయని భావిస్తున్నారు. దీంతో ఈ పాదయాత్రకు టీడీపీ కూడా పరోక్షంగా సహకారం అందించే అవకాశాలున్నాయి. అదే సమయంలో ఇప్పటికే టీడీపీని అమరావతి గ్రామాల్లో యాత్రలు, శిబిరాల విషయంలో అడ్డుకుంటున్న వైసీపీ సర్కార్.. ఇప్పుడు బీజేపీ విషయంలో ఎలా స్పందిస్తుందో కూడా చూడాలి. బీజేపీ విషయంలో వైసీపీ సర్కార్ స్పందించే తీరు ఆధారంగా రాష్ట్రంలో భవిష్యత్ రాజకీయాలు కూడా ఆధారపడి ఉంటాయని చెప్తున్నారు.












Click it and Unblock the Notifications