కీలక నిర్ణయం కోసం కోర్టు తలుపు తట్టనున్న అమరావతి రైతులు
అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఉద్యమం సెప్టెంబరు 12వ తేదీకి వెయ్యిరోజులు పూర్తిచేసుకోబోతోంది. ఈ సందర్భంగా 29 గ్రామాల్లోని రైతులు రెండో విడత పాదయాత్ర ప్రారంభించబోతున్నారు. 'అసెంబ్లీ నుంచి అరసవెల్లి వరకు' 60 రోజులపాటు సాగే ఈ యాత్రకు ఇంకా ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు. మొదటి విడతగా 40 రోజులపాటు 'న్యాయస్థానం టు దేవస్థానం' పేరుతో పాదయాత్ర చేశారు. ఈ యాత్రకు ప్రభుత్వం అనుమతివ్వకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించి అనుమతి తెచ్చుకున్నారు.

jac ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర
రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరు నుంచి ప్రారంభమైన సైకిల్ యాత్ర తుళ్లూరు, రాయపూడి మీదగా వెంకటపాలెంలోని తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గరకు చేరుకుంది. ఈ యాత్రలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులంతా పాల్గొన్నారు. అమరావతికే తామంతా మద్దతుగా ఉంటామని, పాదయాత్రలో రైతులకు అవసరమైన ఆరోగ్య సహకారాన్ని అందిస్తామని వైద్యులు ప్రకటించారు. రెండో విడత పాదయాత్రకు ప్రభుత్వం అనుమతివ్వకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఈ సందర్భంగా అమరావతి ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) నాయకులు ప్రకటించారు.

తాత్సారం చేస్తోన్న ప్రభుత్వం
మొదటి విడత పాదయాత్ర ప్రారంభమయ్యే ముందురోజు వరకు అనుమతివ్వకుండా ప్రభుత్వం తాత్సారం చేసిందని, తమవైపు న్యాయం ఉంది కాబట్టి న్యాయస్థానం తమ గోడు వింటోందని జేఏసీ నేతలన్నారు. రెండో విడత కూడా కావాలనే ప్రభుత్వం అనుమతివ్వకుండా తాత్సారం చేస్తోందని స్పష్టమవుతోందని, కోర్టును ఆశ్రయించడమే తమ ముందున్న ప్రత్యామ్నాయమని ప్రకటించారు.

జరుగుతున్న సన్నాహాలు
రెండో విడత పాదయాత్రకు రాజధాని పరిధిలోని 29 గ్రామాలకు చెందిన రైతులు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఎక్కడెక్కడ ఆగాలి? వసతి, భోజనం, రోజుకు ఎన్ని కిలోమీటర్లు నడవాలి? ఆయా ప్రాంతాల్లో స్థానికుల నుంచి సహకారం అందుతుందా? తదితర విషయాలపై చర్చ నడుస్తోంది. ఈసారి పాదయాత్రలో తాము కూడా పాల్గొంటామని జనసేన నాయకులు ప్రకటించారు. రాజకీయ పరమైన ఆలోచనలు లేకుండా, పార్టీలతో సంబంధం లేకుండా సొంతంగా పాదయాత్రలా నిర్వహిద్దామా? లేదంటే పార్టీల సహకారం తీసుకోవాలా? అనే విషయమై అమరావతి జేఏసీ నేతలు చర్చిస్తున్నారు.












Click it and Unblock the Notifications